Saturday, May 11, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 10
10.
ఉత్క్రామంతం స్థితం వాపి
భుంజానం వా గుణాన్వితమ్‌ |
విమూఢా నానుపశ్యంతి
పశ్యంతి జ్ఞానచక్షుష: ||

తాత్పర్యము : జీవుడు ఏ విధముగా తన దేహమును విడుచుననిగాని, గుణముల కారణంగా అనుభవార్థమైన ఏ దేహమును పొందబోవుననిగాని మూఢులు ఎరుగజాలరు. కాని జ్ఞానచక్షువులు కలిగినవారు ఈ విషయమును చక్కగా చూడగలరు.

భాష్యము : ఈ శ్లోకమున ‘జ్ఞాన చక్షుషా’ అను పదము చాలా ముఖ్యమైనది జ్ఞాన చక్షువులు లేనట్లయితే మనకు మృత్యువు ఎందుకు సంభవిస్తుంది, తరువాత ఎక్కడికి వెళ్ళబోవుచున్నాము, ఎటువంటి శరీరాన్ని పొందుతున్నాము అనేవి అంతుచిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ఇంద్రియ భోగాలను అనుభవించాలనే కోరికలు ఉన్నతంతవరకూ ఈ మార్పులను గుర్తించుట కూడా సాధ్యము కాదు. కాబట్టి గురువును సమీపించి భగవద్గీత వంటి శాస్త్రములను నేర్చుకొనుట ద్వారా జ్ఞానము కలిగి సరైన అవగాహన పెంపొందించుకుంటాడు. ఈ భౌతిక ప్రపంచములో జీవుడు ఎంతో సంఘర్షణకు గురి అగుచున్నాడని అర్థమవుతుంది. దానికి తరుణోపాయమైన భగవత్‌ చైతన్యమును తాను పెంపొందించుకొనుటే కాక ఇతరులకు ఇచ్చి వారి కష్టాలను కూడా నిర్మూలించే ప్రయత్నము చేస్తాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement