Monday, April 29, 2024

సాయి కొర్రపాటి సంకల్పం సాకారం.. అమృతేశ్వరుని చెంత రాజమౌళి దంపతులు

కర్నాటక చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టానికి తెర‌ లేచింది. 25కోట్ల రూపాయల వ్యయంతో హిమాలయ పర్వతశ్రేణుల అనుగ్రహంగా అతి అరుదైన స్వచ్ఛ స్ఫటిక లింగం.. కృష్ణ శిలా శిఖరంగా భాసిస్తున్న అమృతేశ్వర మహాలయంలో కొలువుదీరి రుద్రనమక చమక మంత్రం శక్తులతో అర్చనాభిషేకాలందుకుంటోంది.

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి సంవత్సర కాల దివారాత్రుల భక్తి శ్రమల ఫలితంగా రూపుదిద్దుకున్న అమృతేశ్వర ఆలయం.. సచ్చిదానంద భారతీ మహారాజ్ వారి శిష్య బృంద వేద మంత్ర ధ్వనుల మధ్య పద్మభూషణ్, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దంపతుల పూజతో వేలాది భక్తుల హర్ష ధ్వానాలమధ్య అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది.

ముఖ్య అతిధిగా పాల్గొన్న కె.జీ.ఎఫ్. చిత్రం ఫేమ్, యశ్ తన సొంత ఖర్చుతో ఆలయంపై పదిహేను నిమిషాలపాటు పూలవాన కురిపించి, అనంతరం అమృతేశ్వరుని దర్శనం చేసుకున్నారు. ఆలయంలో నందీశ్వరుని చెంత ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వసలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపూర్వ పవిత్ర పరమ శైవ గ్రంధం ‘ అమృత వర్షిణి ‘ ని రాజమౌళి ఆవిష్క్లరించి పండిత, అర్చక , సినీ ప్రముఖులకు అందజేశారు.

ఆలయప్రాంగణంలోప్రశాంత వాతావరణంలో పురాణపండ శ్రీనివాస్ మౌనంగా శివ పారాయణం చేసుకున్నారని ఆలయ వర్గాలు చెప్పాయి. ఈ అపూర్వకార్యక్రమంలోరాజమౌళి కుమారుడు కార్తికేయ , కీరవాణి కుమారుడు కాలభైరవ, ప్రముఖ జానపద గాయని మంగ్లీ తదితరులు పాల్గొన్నారు.

ఆలయమంతా సుమారు వందమంది వేదపండితులతో వేదగానం, వేద విహితమైన కర్మలు అత్యద్భుతంగా సాగడంతో భక్త జనకోటి పరవశించిపోయారు. జనం పోటెత్తడంతో పోలీస్ లు రంగప్రవేశం చేసి కాట్టడి చేయాల్సి వచ్చింది. భారత దేశ చరిత్రలో ఈ శివాలయం చరిత్రకెక్కడం ఖాయమని కర్నాటకం రాజకీయ, సాంస్కృతిక , పండిత సమాజంలో అప్పుడే చర్చించుకోవడం ఆశ్చర్యకరం. సన్నిహితులైన రాజమౌళి, సాయికొర్రపాటి, పురాణపండ శ్రీనివాస్ చాలాకాలం తర్వాత ఒకే కార్యంలో తారసపడటం అందరినీ ఆనందపరిచిందని సినీ ప్రముఖులు వ్యాఖ్యానించుకోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement