Saturday, May 4, 2024

ఆర్టీసీ రూటు మారనుందా.. ఆదాయమొచ్చే రూట్లలోనే కొత్త బస్సులు?

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్సార్టీసీ) రూటు మారనుందా ? ఈ క్రమంలో… త్వరలో నిర్ణయాలు జరగనున్నాయా ? ఈ ప్రశ్నలకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్న ఆర్టీసీ… ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై త్వరలో ప్రభుత్వంతో చర్చించనున్నట్లు వినవస్తోంది. వివరాలిలా ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా నష్టాలతో నడుస్తూ వస్తోన్న ఆర్టీసీ… ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత… ప్రభుత్వం కూడా ఆయా సందర్భాల్లో ఆర్ధికంగా చేయూతనిస్తూ వస్తోంది. కాగా ఇకపై మరింత దూకుడుగా వెఁళ్ళాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. ఇందుకు ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తుండడంతో త్వరలో చర్చలు జరగనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి.

నష్టాలతోనే నెట్టుకుంటూ వస్తోన్న ఆర్టీసీ గట్టెక్కించాలని, అదే క్రమంలో ఆర్ధికంగా నిలదొక్కుకోవాలని భావిస్తోన్న సంస్థ.కు తాజాగా కొత్త బస్సులను కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో… త్వరలో వెయ్యి కొత్త బస్సులు రానున్నాయి. ముందస్తుగా 200 కొత్త బస్సులు రానున్న విషయం తెలిసిందే. కాగా… కొత్తగా కొనుగోలు చేయనున్న బస్సులను… ఆదాయమొచ్చే రూట్లలోనే ప్రవేశపెట్టాలని సంస్థ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన రూట్ల విషయానికొస్తే… హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద-భద్రాచలం, హైదరాబాద్‌-నిజామాబాద్‌ వంటి రూట్లతోపాటు మరో 20 రూట్లలో తిరిగే బస్సులకు సంబంధించి ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటోంది. ఇటువంటి రూట్లలో బస్సుల కొరత కూడా ఉంటోంది. ఈ క్రమంలోనే… ఆర్టీసీ యాజమాన్యం కొత్త నిర్ణయాలకు తెరతీస్తున్నట్లు వినిపిస్తోంది. ప్రత్యేకించి… కొత్తగా కొనుగోలు చేయనున్న బస్సులను ఆదాయమొచ్చే రూట్లలోనే ప్రవేశపెట్టాలని యాజమాన్యం భావిస్తున్నట్లు వినవస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయా రూట్లలో తిరుగుతున్న బస్సులను ‘పల్లెవెలుగా’ కేటగరీగా మార్చాలని భావిస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ ఈ నిర్ణయాలు అమలైనపక్షంలో హైదరాబాద్‌ సహా మరికొన్ని డివిజన్లకు చెందిన వంద బస్సులు ఇతర రీజియన్లకు తరలిపోనున్నాయి. అయితే భద్రాచలం, యాదగిరిగుట్ట తదితర పుణ్యక్షేత్రాలతోపాటు ఇతరత్రా మరికొన్ని ప్రాంతాలకు మాత్రం ఇందుకు మినహాయింపునివ్వాలని, ఆయా ప్రాంతాలకు మాత్రం కొత్త బస్సులను వేయాలని యాజమాన్యం సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల రూట్లలో కూడా కొత్త బస్సులనే తిప్పాలని సంస్థ భావిస్తోంది.

ఇదిలా ఉంటే… కొత్తగా కొనుగోలు చేయనున్న బస్సులను అధికాదాయా వచ్చే రూట్లలో తిప్పాలని, ఇప్పటివరకు ఆయా రూట్లలో తిరుగుతున్న బస్సులను పల్లెవెలుగు రూపంలో గ్రామీణ ప్రాంతాలకు పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో… హైదరాబాద్‌-భద్రాచలం తదితర రూట్లలో ప్రస్తుతం తిరుగుతున్న బస్సుల్లో సుదీర్ఘకాలం నుంచి తిరుగుతున్న బస్సులను నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు తరలించాలని, వాటి స్థానంలో కొత్త బస్సులను నడపాలని, తద్వారా ఓఆర్‌(ఆక్యుపెన్సీ రేషియో)ను పెంచుకోవాలని సంస్థ యోచిస్తోంది.

- Advertisement -

మొత్తంమీద కొత్త ప్రతిపాదనల నేపథ్యంలో రానున్న సంవత్సరాల్లో మొదటి దశలో భాగంగా దాదాపు 500 బవరకు పాత బస్సులు గ్రామీణ ప్రాంతాలకు తరలుతాయని, వాటి స్థానంలో కొత్త బస్సులు రానున్నాయని చెబుతున్నారు. మొత్తంమీద ఓఆర్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా, తద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని ఆర్టీసీ ప్ర‌యత్నిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement