Monday, May 20, 2024

Vande Bharat | త్వరలో మరిన్ని వందేభారత్‌ రైళ్లు…

విశాఖపట్నం, ప్రభన్యూస్‌:దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మరిన్ని వందేభారత్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయని, ప్రస్తుతం వారానికి ఒక వందేభారత్‌ రైలు నిర్మాణం జరుగుతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ల అభివృద్ధిలో భాగంగా విశాఖ జిల్లాలోని రూ.20కోట్లతో సింహచలం రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులను బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.8,406కోట్ల కేటాయించి ఖర్చు చేస్తున్నామన్నారు.

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేవలం రైల్వేల అభివృద్ధికి 886కోట్ల రూపాయాలు మాత్రమే ఖర్చు చేశారని, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 72 వరల్డ్‌ క్లాస్‌ స్టేషన్లును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అవసరమైన అన్ని స్టేషన్లలలో ప్లైఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌పాత్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు 52ఎకరాల భూమి అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం ఆయా భూమిని కేటాయించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని, స్థలం కేటాయించకపోవడం కార ణంగానే జోన్‌ నిర్మాణం ఆలస్యమైందన్నారు.

ఇప్పటికే విశాఖ రైల్వేజోన్‌కు రూ.160కోట్ల నిధులు కేటాయించామన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా బిఎస్‌ఎన్‌ఎల్‌ సేవల విస్తరణలో భాగంగా వచ్చే దీపావళి నాటికి 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా విస్తరణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయన్నారు. నాలుగువేల నూతన సెల్‌ ఫోన్‌ టవర్లు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో అధికంగా ఉత్తరాంధ్రలోనే నిర్మాణం జరుగుతాయని మంత్రి అశ్విని వైష్ణవి అన్నారు.విజయనగరం జిల్లా కంటాకాపల్లి వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతుందన్నారు.

- Advertisement -

వికసిత్‌ భారత్‌పై విస్తృత ప్రచారం చేయండి

అర్హత ఉండి ఇప్పటి వరకు లబ్ది పొందని లబ్థిదారులకు కేంద్ర ప్రభుత్వ పధకాల అందించడమే వికసిత బారత్‌ సంకల్పయాత్ర లక్ష్యమని కేంద్ర రైల్వే అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. శనివారం విశాఖలో వికసిత భారత్‌ సంకల్పయాత్ర ప్రచారరధాన్ని ఆయన జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ మాట్లాడుతూ వికసిత భారత్‌ సంకల్పయాత్ర రధాన్ని ఇక్కడ నుండి ప్రారంభించడం ఆనందదాయకంగా ఉందన్నారు. గత తొమ్మిదేళ్లలో భారత దేశం ఎంతో అభివృద్ది చెందిందని, ప్రతి గ్రామంలో రహదారులు, మరుగుదొడ్లు, కరెంటు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

మహిళలకు అనేక పథకాల ద్వారా గ్యాస్‌ సిలిండర్లు, అర్హులందరికీ ఇళ్లు, ఉచిత ఆహార ధాన్యాల పంపిణి , ఆయూష్మాన్‌ భారత్‌ ద్వారా 5లక్షల వరకు ఆరోగ్య సంరక్షణ అనేక పధకాలు ప్రజలకు చేరుతున్నాయా? లేదా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎవరికి లబ్దిచేకూరలేదో అటు-వంటి వారిని గుర్తించి భారత సంకల్పయాత్ర ద్వారా లబ్ది చేకూర్చడం జరుగుతుందన్నారు. కోవిడ్‌ సమయంలో ప్రతి ఒక్కరికి రెండు వ్యాక్సిన్లు ఉచితంగా అందించారని,దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా నెలకు 5 కేజీల బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వ పథకాలను పొందిన లబ్దిదారులతో ముఖాముఖిగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు,బీజేపీ మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ ముత్తా నవీన్‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిన్‌ మాధవ్‌, వాల్తేరు రైల్వే డిఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌,విశాఖ కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, గ్రేటర్‌ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement