Friday, April 26, 2024

Followup: ఆఖర్లో నష్టాల్లోకి.. గంట వ్యవధిలో సెన్సెక్స్‌ 800 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం వరకు అదే జోరును కొనసాగించాయి. అయితే, చివరి గంటలో అమ్మకాల ఒత్తిళ్లతో ఆరంభలాభాలు ఆవిరయ్యాయి. దీంతో రెండు రోజుల లాభాల నుంచి సూచీలు మళ్లిd నష్టాల్లో ముగిశాయి. గరిష్ట స్థాయిల్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతోపాటు ఆగస్టు నెల డెరివేటివ్‌ కాంట్రాక్టులకు చివరి రోజు కావడం సూచీలపై ప్రభావం చూపింది. దానికితోడు రూపాయి బలహీనత, ముడిచమురు ధరల పెరుగుదల కూడా మార్కెట్లపై ప్రతికూలత చూపింది. ప్రారంభంలో నిఫ్టీ 17,679వద్ద ఉత్సాహంగాట్రేడింగ్‌ ప్రారంభించింది.

ఇంట్రాడేలో 17726-17487 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 82పాయింట్ల నష్టంతో 17522 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 310 పాయింట్ల నష్టంతో 58,774 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే, రూపాయి మారకం విలువ మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.79.86 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీ, ఎస్‌బీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటాన్‌, విప్రో షేర్లు లాభాల్లో ముగియగా, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ బ్యాంక్‌, ఇన్ఫీ, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టి, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టిపిసి, హెచ్‌డిఎఫ్‌సి, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

థెర్మాక్స్‌ షేర్లు గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో 9 శాతానికిపైగా లాభపడింది. అదే సమయంలో ఆర్‌బీఎల్‌ షేర్లు గత మూడు సెషన్లలో 23 శాతం మేరకు పెరిగాయి. రూ.3000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలపడమే ఇందుకు కారణం. రూ. 247 కోట్లు ఆర్డర్‌ లభించడంతో పీఎస్‌పీ ప్రాజెక్టు షేర్లు ఇంట్రాడేలో 6 శాతం మేరకు లాభపడ్డాయి. ఐడీబీఐ, ఎన్‌డీటీవీ షేర్లు కూడా బాగాపెరిగాయి.

- Advertisement -

ఫెడ్‌ ప్రకటన.. జీడీపీ డేటా
ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జాక్సన్‌ హోల్‌ శుక్రవారం కీలక ప్రకటన చేయనున్నారు. ఆర్థిక దృక్పథం గురించి, ఇటీవలి ఫెడ్‌ వ్యాఖ్యలకు ఆయన స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. వడ్డీరేట్ల పెంపు అంచనాలను ప్రస్తావించొచ్చు. ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యల నేపథ్యంలో, సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటన కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రిలయన్స్‌ వార్షిక సాధారణ సమావేశం ఆగస్టు 29న జరగనుంది. కొత్త ఎనర్జీ సెగ్మెంట్‌, 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ధర, ఆయిల్‌ టు కెమికల్‌ (ఒ2సి), టెలికం ఆర్మ్‌ ఐపీవో, రిటైల్‌ వర్టికల్స్‌లో కంపెనీ పురోగతిపై తాజా డేటా వెలువడే అవకాశం ఉంది. భారతదేశ జీడీపీ డేటా కూడా కీలక అంశం. ఈవారంలో కీలకమైన స్థూల ఆర్థిక డేటా విడుదల కావడానికి ముందే మదుపర్లు అప్రమత్తంగ వ్యవహరించారు. లాంగ్‌ పొజిషన్లు తీసుకోవడానికి సుముఖత చూపలేదు. ఈనెల 31న జీడీపీ డేటా వెల్లడి కానుంది. ఇవికాకుండా, నెలవారీ పీఎంఐ, ఆటో డేటాల కోసం మదుపర్లు ఆసక్తిగావేచివున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement