Monday, April 29, 2024

పెరిగిన క్రెడిట్‌ కార్డు, యూపిఐ చెల్లింపులు.. వినియోగం పెరగడం వల్లే అంటున్న నిపుణులు

క్రెడిట్‌ కార్డు, యూపిఐ చెల్లింపులు భారీగా పెరిగాయి. కొవిడ్‌ తరువాత ఆర్థిక వ్యవస్థ కొలుకుందని చెప్పడానికి ఇది సంకేతమని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగం పెరగడం వల్లే చెల్లింపులు పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ వెల్లడించిన డేటా ప్రకారం యూపిఐ లావాదేవీలు ఏప్రిల్‌లో 9.83 లక్షల కోట్టు ఉంటే, ఆగస్టులో 10.73 లక్షల కోట్లకు పెరిగాయి. పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ ద్వారా క్రెడిట్‌ కార్డు చెల్లింపులు ఏప్రిల్‌లో 29,988 కోట్లు ఉంటే, ఆగస్టు లో ఇది 32,383 కోట్లకు పెరిగాయి. క్రెడిట్‌ కార్డు ద్వారా ఇ-కామర్స్‌ సంస్థల నుంచి కొనుగోళ్లు ఏప్రిల్‌లో 51,375 కోట్లు జరిగాయి. ఆగస్టులో ఇవి 55,264 కోట్లకు పెరిగాయి.

క్రెడిట్‌ కార్డు ద్వారా జరుగుతున్న లావాదేవీలు 16 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసినట్లు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఎండీ, సీఈఓ రామ్మెహన్‌రావు చెప్పారు. కార్డుల వినియోగం భాగా పెరిగిందని, సంస్థలు జారీ చేసే క్రెడిట్‌ కార్డుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఇలా క్రెడిట్‌ కార్డు ద్వారా జరుగుతున్న కొనుగోళ్లు కొన్ని నెలలుగా నెలకు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉంటున్నాయని ఆయన వివరించారు. రానున్న పండుగల సీజన్‌లో ఇది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

డిజిటల్‌ లావాదేవీల సంఖ్యతో పాటు, విలువ కూడా పెరగడం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంకేతాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది మంచి సూచన అని వారు చెప్పారు. దేశంలో డిజిటల్‌ చెల్లింపులు పెరగడం ఈ రంగానికి సానుకూల సంకేతమని పే నియర్‌ బై ఎండీ, సీఈఓ అనంద్‌ కుమార్‌ బజాజ్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement