Friday, July 26, 2024

భారత్‌లో కరెంట్‌ను తెగవాడేస్తున్నారు! 9శాతం పెరిగిన విద్యుత్ వినియోగం..

భారత్‌లో రోజురోజుకు విద్యుత్‌ భారీగా డిమాండ్‌ పెరిగింది. అంటే… విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. ఓ వైపు వర్షాభావంతో వ్యవసాయ రంగానికి విద్యుత్‌ వాడకం పెరగడంతోపాటు పారిశ్రామిక రంగం వృద్ధి చెందిన నేపథ్యంలో కరెంట్‌ వినియోగిం పెరిగిపోయింది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్‌ భారీగా డిమాండ్‌ పెరిగింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం… గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9శాతం పెరుగుదల నమోదైంది.

ఏప్రిల్‌- నవంబర్‌ మధ్య దేశంలో మొత్తం విద్యుత్‌ వినియోగం 1099.90 బిలియన్‌ యూనిట్లుగా రికార్డయ్యింది. గతేడాది ఇదే సమయంలో విద్యుత్‌ వినియోగం 1010.20 బిలియన్‌ యూనిట్లుగా ఉన్నది. 2021-22 సంవత్సరంలో ఏప్రిల్‌- నవంబర్‌ మధ్య కాలంలో మొత్తం వినియోగం 916 బిలియన్‌ యూనిట్లుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వినియోగం 1504.26 బిలియన్‌ యూనిట్లు.

- Advertisement -

ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1374 బిలియన్‌ యూనిట్ల కంటే ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో విద్యుత్‌ వినియోగం 9శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థలో భూమ్‌ కారణమని ఇంధనరంగ నిపుణులు పేర్కొంటున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23లో దేశంలో విద్యుత్‌ వినియోగం 50.8శాతం పెరిగిందని కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ఇటీవల లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

2013-14లో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 136 గిగావాట్లు కాగా.. 2023లో ఈ డిమాండ్‌ 243 గిగావాట్లకు పెరిగింది. కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ మాట్లాడుతూ… సామర్థ్యాన్ని 194 గిగావాట్లకు పెంచాం. దీంతో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈ వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ 229 గిగావాట్లకు చేరుకుంటుందని ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అయితే, ఏప్రిల్‌- జులైలో కురిసిన వర్షాల కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ కాస్త తక్కువగా ఉండడంతో ఇప్పటికీ ఆశించిన స్థాయి కంటే తక్కువగానే ఉన్నది. గత జూన్‌లో దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ 224 గిగావాట్లకు చేరినప్పటికీ, జులైలో అది క్షీణించి 209 గిగావాట్లకు చేరుకుంది. ఆ తర్వాత ఆగస్టులో 238.82 గిగావాట్లు, సెప్టెంబర్‌లో 243.27 గిగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉన్నది.

అక్టోబర్‌లో దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ 222.16 గిగావాట్లు కాగా, నవంబర్‌లో 204.86 గిగావాట్లు రికార్డయ్యింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో కురిసిన వర్షాల కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ తగ్గినా ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతోపాటు పండుగల సీజన్‌ కావడంతో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంతో విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement