Wednesday, May 1, 2024

భారత్‌ను వీడుతున్న సీ లిమిటెడ్‌, ఈ-కామర్స్‌ సేవలకు దూరం.. షాపీ పేరుతో భారత్‌లో సేవలు

భారత్‌ను వీడిపోతున్న కంపెనీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. తాజాగా సింగపూర్‌కు చెందిన సీ లిమిటెడ్‌ కంపెనీ భారత్‌లో తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. భారత్‌లో ఈ-కామర్స్‌ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపింది. సీ లిమిటెడ్‌ సంస్థ.. షాపీ పేరుతో ఈ-కామర్స్‌ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నది. అయితే ఇప్పటికే ఫ్రాన్స్‌లో కూడా ఈ-కామర్స్‌ వ్యాపార రంగం నుంచి తప్పుకుంది. కొన్ని వారాల్లోనే.. భారత్‌లో కూడా వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం షాపీ వెల్లడించింది. అయితే ఈ-కామర్స్‌లో షాపీ సేవలు నిలిపివేయడం ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదనే వార్తలు వినిపిస్తున్నాయి. ముందు నుంచే వైదొలిగే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ వచ్చినట్టు సమాచారం.కొత్త వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం కూడా షాపీ కొన్ని నెలలుగా నిలిపివేసింది. దీంతో అటు వ్యాపారం కూడా దిగజారుతూ పోయింది. ఫలితంగా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కూడా తగ్గింది. సుమారు 15 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టాన్ని షాపీ మూటగట్టుకున్నట్టు సమాచారం.

యాప్‌ నిషేధమే కారణమా?
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా భారత్‌లో తాము కార్యకలాపాలు నిలిపివేసేందుకు నిర్ణయించామని సీ లిమిటెడ్‌ తెలిపింది. అయితే భారత్‌ నుంచి వైదొలిగేందుకు మరో కారణం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం గత నెలలో 53 యాప్స్‌పై నిషేధం విధించింది. అందులో సీ లిమిటెడ్‌ సంస్థకు చెందిన గరెనా ఫ్రీ ఫైర్‌ యాప్‌ కూడా ఉంది. భారత్‌లో ఈ యాప్‌కు మంచి ఆదరణ కూడా లభించింది. తమ ఫ్రీ ఫైర్‌ యాప్‌పై నిషేధం విధించినందుకు గాను.. సీ లిమిటెడ్‌.. షాపీ ఈ-కామర్స్‌ సేవలను ఉప సంహరించుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ వాదనలను సీ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు ఖండించారు. తాము వైదొలిగేందుకు.. గరెనా ఫ్రీ ఫైర్‌ యాప్‌ నిషేధానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితే దీనికి కారణమంటూ వివరణ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement