Sunday, May 19, 2024

పల్లెల రూపురేఖలు మార్చే ప్రణాళికలు ఇవే..

గ్రామీణ పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ ఆలోచనల నుంచి వచ్చిన ‘స్వచ్ఛసంకల్పం’లో ప్రతి గ్రామసర్పంచ్ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం సన్నాహక శంఖారావం సందర్బంగా తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయం నుంచి 13 జిల్లాల గ్రామ సర్పంచ్‌లతో నిర్వహించిన వీడియో కార్ఫెరెన్స్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో గ్రామసీమలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలని నిత్యం సీఎం జగన్ తపిస్తూ ఉంటారని తెలిపారు. అందుకోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వపరంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో ఆరోగ్యకరమైన గ్రామాలు ఉండాలనే లక్ష్యంతో పనిచేయాలన్న సీఎం సంకల్పం నుంచి జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమం ఒక ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకువస్తున్నామని చెప్పారు. గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని గ్రామాలను వ్యర్థాలు రహితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రారంభిస్తున్న జగనన్న స్వచ్ఛసంకల్పంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.

జూలై 8వ తేదీన దివంగత మాజీ సీఎం వైయస్‌ఆర్ జయంతి రోజున జగనన్న స్వచ్ఛసంకల్పంను సీఎం జగన్ ప్రారంభిస్తున్నారని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలను తీసుకురావడానికి గ్రామ సర్పంచ్‌లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచ్‌ల భాగస్వామ్యంతోనే పల్లెల రూపురేఖలు మారుతాయని, ప్రజాప్రతినిధులుగా మీ ఎదుగుదలకు సర్పంచ్‌ పదవి తొలిమెట్టు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని అన్నారు. పట్టణాలకు ధీటుగా మీ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని, ప్రతిగ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలని కోరారు. ఇందుకోసం పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలని, జగనన్న స్వచ్ఛసంకల్ప కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని అన్నారు. గతంలో పరిశుభ్రతా పక్షోత్సవాలు, వ్యర్థాలపై పోరులో పల్లెలు కలిసి వచ్చాయని గుర్తు చేశారు. వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం పేరుతో నిర్వహించిన కార్యక్రమం వల్ల 61,514 గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించామని, ప్రజల నుంచి 6.21 కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా విరాళాలుగా వచ్చాయని తెలిపారు. మనం నిర్వహించిన పరిశుభ్రతా కార్యక్రమాల వల్ల గత ఏడాదితో పోలిస్తే అంటువ్యాధులు 95శాతం తగ్గాయని, ఇది ఒక జాతీయ నిర్వహించిన సర్వేలో వెల్లడైన వాస్తవం అని అన్నారు. అంతేకాదు దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 567 ఓడిఎఫ్‌ ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందడం విశేషమని అన్నారు. ఇదే స్పూర్తితో రాష్ట్రంలో 13,371 పంచాయతీల్లో జూలై 8న ప్రారంభమయ్యే జగనన్న స్వచ్ఛసంకల్పంను విజయవంతం చేయాలని కోరారు.

పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, 15వ ఆర్థికసంఘం ద్వారా 1320 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలకు అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలనే లక్ష్యంతో 13,095 సర్పంచ్‌లకు గానూ 11,152మందికి చెక్ డ్రాయింగ్ పవర్ ఇచ్చామని అన్నారు. మిగిలిన 1943 మంది సర్పంచ్‌లకు కూడా రెండుమూడు రోజుల్లో చెక్ పవర్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

100 రోజుల జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా.. జూలై 8వ తేదీ నుంచి వంద రోజుల పాటు జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 1వ రోజు నుంచి 10వ రోజు వరకు కార్యక్రమం ప్రారంభోత్సవంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం. 11వ రోజు నుంచి 20వ రోజు వరకు గడప గడపకు ప్రచారం, 21వ రోజు నుంచి 30వ రోజు వరకు ఘన వ్యర్థపదార్ధాల నిర్వహణపై దృష్టి పెట్టడం, 31వ రోజు నుంచి 40వ రోజు వరకు వనరుల సమీకరణ చేస్తారు. ఇక, 41వ రోజు నుంచి 50వ రోజు వరకు : తడి, పొడి చెత్త ఇంటివద్దే వేరు చేసి ఇచ్చే విధంగా అవగాహన కల్పిస్తారు. 51వ రోజు నుంచి 60వ రోజు వరకు ద్రవ వ్యర్థ పదార్ధాల నిర్వహణలో భాగంగా కమ్యూనిటీ సోక్ పిట్స్ (ఇంకుడు గుంతలు) గుర్తించి నిర్మాణం చేపడతారు. 61వ రోజు నుంచి 70వ రోజు వరకు టాస్క్ ఫోర్స్‌ కమిటీల ఏర్పాటు ద్వారా తాగునీటి, పారిశుధ్య సమస్యలను గుర్తించి పరిష్కరిస్తారు. 71వ రోజు నుంచి 80వ రోజు వరకు గ్రామంలోని అన్ని తాగునీటి వనరులను శుభ్రపరుస్తారు. 81వ రోజు నుంచి 90వ రోజు వరకు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇక, 91వ రోజు నుంచి 100వ రోజు వరకు గ్రామ పారిశుధ్య ప్రణాళిక తయారు చేసి గ్రామసభలో ఆమోదిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement