Thursday, April 25, 2024

ఇంత‌కీ మీ పోత్తులో ముఖ్య‌మంత్రి ఎవ‌రు? …టిడిపి,జ‌న‌సేన‌ల‌కు స‌జ్జ‌ల ప్ర‌శ్న‌

అమరావతి, ఆంధ్రప్రభ: పొత్తుల గురించి మాట్లాడుతున్న టీ-డీపీ, జనసేన సీఎం క్యాండిడెంట్‌ చంద్రబాబా, పవన్‌ కళ్యాణా, లోకేషా అన్నది ముందు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి డిమాండ్‌ చేశారు. వాళ్ళ సీఎం అభ్యర్థి ఎవరైనా తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. . ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు- చీలనివ్వబోమని ప్రగల్భాలు పలుకుతున్న వాళ్లు సీఎం క్యాండెట్‌ పై స్పష్టత ఇవ్వాలన్నారు. ఎన్నికల్లో ఎవరైనా ప్రజామోదంతోనే విజయం సాధిస్తారని, ఈ విషయంలో సీఎం వైయస్‌ జగన్‌ చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా బరిలోకి దిగుతామన్న విషయాన్ని ఆయన చెబుతున్నారని, చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం ఉందా? అసలు మొత్తం 175 చోట్ల టీ-డీపీ పోటీ- చేస్తుందని చంద్రబాబు చెప్పగలరా? లేదా తాను రి-టైర్‌ అవుతున్నానని, కాబట్టి తన వారసుడిగా లోకేష్‌ను తెస్తున్నాను అని చెప్పగలడా అని సవాల్‌ విసిరారు. ధైర్యం ఉంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని పవన్‌ ప్రకటించాలన్నారు. ప్రజాబలం లేదు కాబట్టి టీడీపీ, జనసేన పార్టీలు ఆ విషయంలో స్పష్టత ఇవ్వలేవని సజ్జల ఎద్దేవా చేశారు. చివరకు లోకేష్‌ కూడా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయమని అడగడం లేదన్నారు. తమ విజయంపై వాళ్ళకు నమ్మకం ఉంటే సీఎం క్యాండెట్‌ ఎవరన్నది ప్రకటించాలని సజ్జల సవాల్‌ విసిరారు. చంద్రబాబును సీఎం చేయడమే పవన్‌ కళ్యాణ్‌ లక్ష్యం అని అందుకే పొత్తులపై వింత ఆప్షన్లు ఇస్తున్నాడన్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎన్ని కుట్రలు చేసినా 2024 ఎన్నికల్లో పరాభవం తప్పదని సజ్జల జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోమారు జగన్‌ సీఎం అవ్వడం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు.

87 శాతం ఉద్యోగాల్లో వారే
ఎస్సీలకు నిధుల కేటాయింపుల్లో కోత విధిస్తున్నా రంటూ టీ-డీపీ, జనసేన చేస్తున్న దుష్ప్రచారం ప్రజలు నమ్మబోరన్నారు. చంద్రబాబు హయాంలో గత ఐదేళ్ళలో ఎస్సీల సంక్షేమం కోసం రూ.33 వేల కోట్లు- ఖర్చు చేస్తే, వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నర ఏళ్లలోనే రూ.48 వేల కోట్లు- చేసిందన్నారు. పథకాల్లో డీబీటీ- ద్వారా అందిన మొత్తం కూడా చూస్తే, ఆ మొత్తం రూ.78 వేల కోట్లు- అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం ఖర్చు చేసిన రూ.33 వేల కోట్లలో అన్న క్యాంటిన్లు, చంద్రన్న కానుక, పెన్షన్లు కూడా ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ-లకు ప్రాధాన్యం ఇస్తోందని సజ్జల వివరించారు. మహిళలు, రైతులు, యువతకు పూర్తి అండగా నిలుస్తోందన్నారు. సచివాలయాల ఉద్యోగాల్లో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ-లో ఎంపికయ్యారని గుర్తు చేశారు. 2014-19 మధ్య టీ-డీపీ అరాచక పాలన సాగించడం వల్లే ఫర్టీ ఈయర్స్‌ చంద్రబాబును ప్రజలు పాతాళంలోకి తొక్కేశారన్నారు. పది సంవత్సరాల ముందు ఏ గ్లామర్‌ లేకుండా తండ్రి ఆశయాలను స్పూర్తిగా తీసుకుని జగన్‌ పెట్టిన పార్టీని ప్రజలు అక్కున చేర్చుకున్నార న్నారు. టిడిపిని కంప్లీట్‌ గా ప్రజలు రిజెక్టు చేశారన్న విషయం చంద్రబాబు గుర్తెరిగితే మంచిదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement