Wednesday, April 17, 2024

కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలోనే విశాఖ స్టీల్.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిలాష‌

విశాఖ ఉక్కు అనేది తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడిన పరిశ్రమ. 32 మంది ప్రాణ త్యాగాలతో… ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగా సిద్ధించినదే విశాఖ ఉక్కు పరిశ్రమ. ఇంతటి ఘన నేపథ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలన్నది జనసేన పార్టీ ఆకాంక్ష అని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ పరిశ్రమ ప్రయివేటీకరణ అంశం ప్రకటన వచ్చినప్పుడు స్పందించి ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసినప్పుడు వారు సానుకూలంగానే స్పందించార‌ని అన్నారు. ఆ స్పందన ఎంతో ఆశావాహంగా కనిపించిద‌ని,. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ను కలిసి విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకున్న భావోద్వేగ బంధాన్ని తెలియచేసి ఈ పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని కోరామ‌ని వెల్ల‌డించారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పూర్తి పాఠ‌వం..

ఈ రోజు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగన్ సింగ్ కులస్తే గారు ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదు. దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదు’ అని చేసిన ప్రకటన హర్షణీయం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో రైతులు తమ భూములను త్యాగం చేశారు. ఇందులో కొందరికి ఇప్పటికీ సెటిల్మెంట్ కాలేదు. ఇలాంటి పరిశ్రమపై రాష్ట్ర పాలకులు సైతం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారికి తొలి నుంచీ చిత్తశుద్ధి లోపించింది. జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలవడంతోపాటు భారీ బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర పాలకులు అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలని విజ్ఞప్తి చేశాం. అయినా వైసీపీ పాలకులు స్పందించలేదు. జనసేన పార్టీ ప్రతి సందర్భంలో కేంద్ర నాయకత్వం, కేంద్ర మంత్రులతో చర్చించినప్పుడు విశాఖ ఉక్కును పరిరక్షించాలని బలంగా చెప్పాం. కొద్ది రోజుల కిందట పొరుగు రాష్ట్రం ఈ అంశంలో స్పందించింది. దీని వెనక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, నేపథ్యాలపై వైసీపీ పాలకులు విమర్శలు చేస్తున్నారు తప్ప పరిశ్రమ కాపాడుతామనే మాట చెప్పలేకపోయారు. చిత్తశుద్ధి లేని రాష్ట్ర పాలకుల వల్ల విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం ముందుకు వెళ్లలేదు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపింది. జనసేన పార్టీ తొలి నుంచి ఈ పరిశ్రమను పరిరక్షించాలనే కోరుతోంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను బలోపేతం చేయాలని నిర్ణయించిన దృష్ట్యా విశాఖ ఉక్కు బలపడుతుందని భావిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement