Saturday, May 4, 2024

AP : వైకాపా ఒక్క ప‌రిశ్ర‌మ‌ను తేలే…నారా లోకేశ్‌

వైకాపా నేతలు ఉరవకొండను దోచేస్తున్నార‌ని నారా లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్, సైన్స్‌ సిటీ పేరుతో వైకాపా ప్రభుత్వం సుమారు 17 వేల ఎకరాలు సేకరించిందని కానీ ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. తెదేపా హయాంలో వందల కిలోమీటర్ల రోడ్లు వచ్చాయన్నారు. పెద్ద ఎత్తున తాగు, సాగునీటి పనులు జరిగాయని వివరించారు.

”ఉరవకొండలో 3 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఉరవకొండకు పయ్యావుల కేశవ్‌ మెగా డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు సాధించారు. జగన్‌ వచ్చాక ఇక్కడ పది శాతం పనులు కూడా జరగలేదు. వైకాపా నేతలు ఉరవకొండను దోచేస్తున్నారు. నకిలీ ఆధార్‌ కార్డులు, పత్రాలతో భూములు కాజేస్తున్నారు. ఉరవకొండలో 80 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు.. కనీసం 8 ఎకరాలకైనా సాగునీరు ఇచ్చారా? తెదేపా-జనసేన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి. ప్రతి చెరువుకు నీరు, మెగా డ్రిప్‌ ఇరిగేషన్‌ తీసుకువస్తాం. మంగళగిరి మాదిరిగా ఉరవకొండ చేనేతలను ఆదుకుంటాం” అని నారా లోకేశ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement