Thursday, May 9, 2024

AP | రేపే రైతు భరోసా – పీఎం కిసాన్‌ నిధుల విడుదల..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా గడిచిన అయిదేళ్ళుగా అమలుచేస్తున్న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం నిధులను ప్రభుత్వం రేపు (మంగళవారం) అందచేయనుంది. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆర్ధికసాయాన్ని జమ చేయనున్నారు.

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతులకు రూ 4 వేల చొప్పున మొత్తం రూ.2,204.77 కోట్లను అందచేయనున్నారు. ఏడాదికి మూడు విడతలుగా రైతులకు రూ 13,500 లను ప్రభుత్వం అందచేస్తోంది. దీనిలో రూ 6 వేలను కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ పథకం కింద అందచేస్తుండగా మిగతా రూ 7,500 వేలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.

ఈ-క్రాప్‌, ఈ-కేవైసీ ఆధారంగా రూపొందించిన వెబ్‌ ల్యాండ్‌ ఆధారంగా వ్యవసాయం చేస్తున్న భూమి యజమానులతో పాటు పంట సాగు హక్కు పత్రాలున్న దేవాదాయ, అటవీ, ఇతర అర్హులైన ఎస్‌.సీ, ఎస్‌.టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కౌలు రైతులకు కూడా ప్రభుత్వం పెట్టు-బడి సాయం కింద రైతు భరోసా పథకాన్ని అందచేస్తోంది.

2023-24 ఆర్ధిక సంవత్సరానికిగాను తొలివిడతగా రూ 7,500 వేలను 52.57 లక్షల మందికి ఇప్పటికే అందచేయగా ఇపుడు అంతకు మించి 53.53 లక్షల మంది రైతులకు రెండో విడత సాయాన్ని ప్రభుత్వం విడుదల చేస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో మరో రూ 2 వేలను కూడా అందించనుంది. 2019-20 లో 46,69,375 మందికివ రైతు భరోసా అందచేయగా 2020-21లో 51,59,045 మందికి పథకాన్ని వర్తింపచేశారు.

2021-22 లో 52,38,517 మంది రైతు భరోసా – పీఎం కిసాన్‌ ను అందుకోగా 2022-23లో 51,40,943 మంది రైతులకు ఏడాదికి రూ 13,500 ను ప్రభుత్వం పెట్టు-బడి సాయంగా విడుదల చేసింది. ఈ ఏడాది (2023-24)లో అంతకుమించి తొలివిడతలో 52,57,263 మంది లబ్ది పొందగా రెండో విడత లో 53,52,905 మందికి ప్రభుత్వం పెట్టు-బడి సాయం అందించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement