Friday, May 3, 2024

Exclusive | ఏపీ కాంగ్రెస్‌లో టిక్కెట్ల ఆరాటం !

తిరుపతి, (ప్రభ న్యూస్ ప్రతినిధి) : రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశిస్తున్న నేతల సంఖ్య భారీగా పెరిగింది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు 1150 దరఖాస్తులు రాగా 25 పార్లమెంటు స్థానాలకు 170 దరఖాస్తులు వచ్చాయి. గతంలో 2014, 2019 ఎన్నికల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోమన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే నాయకులే కానరాలేదు. తాజాగా షర్మిలమ్మ రాకతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఈ పర్యాయం వేల రూపాయలు దరఖాస్తు మొత్తం కేటాయించినప్పటికీ వెలుగులా భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చి చేరాయి. ఈనెల 29 చివరి గడువు తేదీగా నిర్ణయించి దరఖాస్తులు స్వీకరించారు.

రేపటి నుంచి అభ్యర్థులతో ముఖాముఖీ

ఈనెల 5,6 తేదీలలో టికెట్లు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో షర్మిలమ్మ ముఖాముఖి నిర్వహిస్తారు. తిరుపతి జిల్లా ఆశావాహులతో 6న మధ్యాహ్నం 2 .00 గంటల నుంచి -3.00 గంటలకు, చిత్తూరు జిల్లా దరఖాస్తుదారులతో మధ్యాహ్నం 4గంటల నుంచి -5 గంటల మధ్య పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భేటీకానున్నారు. ఒక్కో అభ్యర్థితో ముఖాముఖి మాట్లాడాలి పార్టీని ప్రక్షాళన చేసి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులను బరిలోకి దించేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.

అభ్యర్థుల ఫైనల్ జాబితాను కేంద్రానికి పంపి ఆయా స్థానాలను కేటాయించనున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి పార్టీ అధిష్టానం నుంచి ముఖాముఖి నిర్వహించే తేదీ సమయాలను కేటాయిస్తూ సంక్షిప్త సమాచారం అందింది. ప్రధానంగా అభ్యర్థి స్థితి గతులు, అసెంబ్లీ నియోజకవర్గంపై అభ్యర్థి అవగాహన, ఆర్థిక పరిస్థితి… ఇత్యాధి ప్రశ్నలతో అభ్యర్థుల స్క్రీనింగ్ జరుగుతోందని, ఇటీవల జరిగిన ముఖాముఖీ భేటీల సమాచారం.

పార్టీ జవసత్వాల కోసం …

- Advertisement -

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడ్డ విషయం విధితమే. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణం అన్న భావనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. చట్టసభల్లో అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీలో ఒక్క సీటు అంటే ఒకటి కూడా ఏపీ నుంచి లేని పరిస్థితి ఏర్పడింది. 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆ పార్టీ కి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రెడ్డిని పీసీసీ అధ్యక్షురాలుగా కేంద్ర నాయకత్వం నియమించింది.

షర్మిల రాకతో పార్టీలో జవసత్వాలు పుంజుకున్నాయనే చెప్పాలి. తన అన్న, వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో వైపు బీజేపీ పై షర్మిల పదునైన విమర్శనాస్త్రాలను సంధిస్తూ పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. 5 బ్రహ్మోస్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఐదు భారీ బహిరంగ సభలను ఎన్నికల కోడ్ రాకముందే నిర్వహించాలని నిర్ణయించిన విషయం విద్యుతమే.

తొలి సభ అనంతపురంలో ప్రతి ఇంటికి ఐదువేల రూపాయలు గ్యారంటీ పేరుతో కొత్త పథకాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కర్కే ప్రకటించిన విషయం విధితమే. రెండవ సభ మార్చి ఒకటిన తిరుపతిలో నిర్వహించి కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తో పాటు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించిన విషయం విధితమే . మూడవ సభ గుంటూరులో నిర్వహించాలని నిర్ణయిస్తారు. ఈ సభలతో పార్టీ క్యాడర్లో జోష్ పెరిగింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో

పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి రాకతో చిత్తూరు జిల్లా పార్టీ శ్రేణుల్లో చిగురిస్తున్నాయి. దీంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు భారీగా పోటీపడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి పార్లమెంటు టికెట్టు కోసం 11 మంది, చిత్తూరు పార్లమెంటుకు 12 మంది పోటీ పడుతూ దరఖాస్తులు చేసుకున్నారు. ఇక అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా గూడూరుకు 19, సూళ్లూరుపేటకు 19, పూతలపట్టుకు 14 , సత్యవేడుకు 13 దరఖాస్తులు వచ్చాయి.

తిరుపతి అసెంబ్లీకి 9 ,వెంకటగిరి కి 5, శ్రీకాళహస్తికి 11 , చంద్రగిరికి 5,, చిత్తూరుకు 8, కుప్పంకు 8, పలమనేరు 5, గంగాధర్ నెల్లూరుకు 9, పుంగనూరు 3,నగిరి 3 దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం భారీగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు రావడంతో పాటు పార్టీకి నిధులు కూడా జమ కావటం విశేషం. అసెంబ్లీ స్థానానికి రూ.10,000లు పార్లమెంటు స్థానానికి రూ.25,000లు చొప్పున దరఖాస్తుకు ధరావత్తు నిర్ణయించారు.ఎస్సీ నియోజకవర్గాల్లో అసెంబ్లీకి రూ.5000లు, పార్లమెంటుకు రూ. 15000లు దరఖాస్తు మొత్తం నిర్ణయించారు. దరఖాస్తుల వెలువతో భారీ ఎత్తున కోట్ల రూపాయలు దరఖాస్తు నిధులు పార్టీకి వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement