Monday, April 29, 2024

AP : గోదావరి జిల్లాల పై టీడీపీ.. జనసేన ఫోకస్..

34 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉమ్మడి వ్యూహం ..
గెలుపు గుర్రాలకే టిక్కెట్లు…
2014 ఫలితాలు రిపీట్ అయ్యేలా ప్లాన్లు..

అమరావతి, ఆంధ్రప్రభ:
వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం టీడీపీ, జనసేన ఉమ్మడి వ్యూహంతో ముందుకుసాగుతున్నాయి.వచ్చే ఎన్నికలలో అధికారం దక్కాలంటే గోదావరి జిల్లాలు కీలకమైన నేపథ్యంలో ఆ జిల్లాల పై ఫోకస్ పెట్టాయి.జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో జెండా ఎగురవేసెందుకు వ్యూహ రచన చేస్తున్నాయి.పొత్తులు మొత్తం ఫలితాలనే మార్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

ఈ నియోజకవర్గాలపైనే అధికార వైసీపీ దృష్టి పెట్టడం తో ఇప్పుడు టీడీపీ , జనసేనలు గట్టి ఫోకస్ పెట్టాయి. టీడీపీ జనసెనలు 2019 ఎన్నికలలో ఫలితాలను పరిగణన లోకి తీసుకొని సైలెంట్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. జనసేన గతంలో ప్రజారాజ్యం లో పని చేసిన వారితో సహా ఇతర పార్టీల్లోని నేతలతో రహస్య మంతనాలు కొనసాగిస్తుంది. రెండు పార్టీల పొత్తు ఖాయం కావడం తో ఇరు పక్షాల నేతలు సీట్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.2014 ఎన్నికల్లో జనసేన -టీడీపీ పొత్తుతొ పశ్చిమ గోదావరిలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో 12 టీడీపీ, 5 వైసీపీ, 1 బీజేపీ, 1 స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. పశ్చిమ గోదావరిలో టీడీపీ కేవలం రెండు స్థానాలు పరిమితం అయింది.తూర్పు గోదావరి లో టీడీపీ 4 స్థానాలు గెలుచుకోగా, జనసేన ఒక్క చోట గెలిచింది. మిగిలిన స్థానాలు వైసీపీ గెలుపొందింది. టీడీపీకి 39.7 శాతం పోలయ్యాయి. వైసీపీకి 53.3 శాతం ఓట్లు దక్కాయి. జిల్లాలో జనసేన ఒకే సీటు గెలిచినా 14.84 శాతం ఓట్లు దక్కించుకుంది. అదే విధంగా పశ్చిమ గోదావరిలో వైసీపీ 12 స్థానాల్లో గెలిచి 46.35 శాతం ఓటింగ్ దక్కించుకుంది.టీడీపీకి 36.30 ఓట్లు దక్కగా, జనసేనకు పశ్చిమలో 11.68 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ లెక్కల పరంగా టీడీపీ – జనసేన పొత్తు తో ఆ పార్టీల అధిక్యత కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కృష్ణా,విశాఖ, కర్నూల్ జిల్లాలలో జనసేన ,టీడీపి బలం పుంజుకున్నాయని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల తరహాలోనే మెజార్టీ సీట్లు అక్కడ దక్కించేలా కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి.ప్రధానం గా
సామాజిక సమీకరణాల ఆధారంగా అడుగులు వేస్తున్నాయి.బీసీ , ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంకు చేజారకుండా రెండు పార్టీల అధినేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాపు సామాజిక వర్గం ఈ సారి ప్రధానంగా జనసేన వైపు చూస్తోందనే ప్రచారం నడుమ టీడీపీ తమ ఓట్ బ్యాంకు పదిలం చేసుకొనే ప్రయత్నాలు చేస్తోంది. పొత్తులు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో టీడీపీ ఈ అంశాన్ని అదనపు బలంగా భావిస్తోంది.ఇక రెండు పార్టీల నుంచి గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కు పూర్తి స్థాయిలో బెయిల్ వచ్చాక అభ్యర్ధులను ఖరారు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement