తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నప్పుడు కొన్ని సీన్లు పదే పదే కనిపించేవి. అధికారులు కానీ, పొలిటికల్ లీడర్లు కానీ తనను కలవడానికి వచ్చినప్పుడు వంగి వంగి సాగిలపడి మరీ దండాలు పెట్టేవాళ్లు. అయితే ఇక్కడ సీన్ అంత కాకున్నా అట్లానే అనిపించేలా ఉందంటున్నారు చాలామంది పరిశీలకులు. ఆంధ్రప్రదేశ్ లో మొన్నటిదాకా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న తానేటి వనితను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఏపీ నూతన హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అధికారులంతా వరుసకట్టారు. మంత్రి వనితను మర్యాదపూర్వకంగా కలిశారు పోలీస్ డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులు. ఈ సందర్భంగా వరుసకట్టి పూల బొకేలు అందిస్తూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సేమ్ టు సేమ్ తమిళనాడు సిస్టమ్ని గుర్తుకు తెస్తోందని కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో చూసినవాళ్లు..
ఏపీలో కచ్చితంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్న డీజీపీ..
ఏపీ హోంమంత్రి తానేటి వనితతో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. నూతనంగా హోంశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాద పూర్వకంగానే మంత్రిని కలిసినట్లు డీజీపీ వివరించారు. ఈ సందర్భంగా పూలబోకే ఇచ్చి, మంత్రి వనితకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. అయితే ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ను కచ్చితంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే పీఎస్లోకి కచ్చితత్వం ఉన్న కేసులు వస్తే, వాటిని వెంటనే పరిష్కరించే దిశగా పోలీసులు చూడాలని హోంమంత్రి ఈ సందర్భంగా డీజీపీకి సూచించారు.