Thursday, May 2, 2024

Support – టీడీపీ జాబితా చేంజ్​ – నాలుగు చోట్ల అభ్యర్థుల మార్పు…

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి ) – ఏపీలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ బరిలో రఘురామ రాజును దించటం దాదాపు ఖరారు అయింది. ఇప్పటికే ఉండి అభ్యర్దిగా మంతెన రామరాజును అధిష్టానం ప్రకటించింది. ఇక అత్యవసర స్థితిలో నరసాపురం సిట్టింగ్​ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజును ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. అక్కడ టీడీపీ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజును టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. రామరాజుకు నచ్చజెప్పి పోటీ నుంచి విరమింపజేసే బాధ్యతను చంద్రబాబు తమ పార్టీ నేతలకు అప్పగించారు. ఈ క్రమంలో రామరాజును పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించారు. అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో కూడా టీడీపీ తమ అభ్యర్థిని మార్చింది. అక్కడ అంతకు ముందు ప్రవాసాంధ్రుడు పైలా ప్రసాదరావుకు సీటిచ్చారు. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో ప్రచారంలో వెనుకబడ్డారని అధినాయకత్వానికి నివేదికలు అందాయి. దీంతో ఆయన్ను మార్చి సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేశారు.

- Advertisement -

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర(ఎస్సీ)లో ప్రస్తుత అభ్యర్థి అనిల్‌ కుమార్‌ను మార్చాలని నిర్ణయించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ సీటును పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజుకు ఇవ్వనున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా మార్చబోతున్నారు. జయచంద్రారెడ్డి ప్రచార రంగంలో వెనుకబడిపోయారు. పైగా ప్రత్యర్థి శిబిరంతో ఆయనకు వ్యాపార సంబంధాలున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు అసెంబ్లీ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. తమకు ఇచ్చిన అనపర్తి సీటును టీడీపీకి తిరిగి ఇవ్వాలంటే తమకు దెందులూరు ఇవ్వాలని బీజేపీ నాయకత్వం షరతు విధించింది. ఇంకో 3-4 స్థానాల్లో మార్పులు చేయాలని టీడీపీ నాయకత్వం యోచిస్తోంది. కడప జిల్లా కమలాపురం, తిరుపతి జిల్లా వెంకటగిరిలో పార్టీ ఇన్‌చార్జులకు బదులు వారసులకు టికెట్లు ఇచ్చారు. ఈ రెండు చోట్లా తిరిగి తండ్రులకే ఇస్తే బాగుంటుందని సూచనలు వచ్చాయి. దీంతో…మార్పుల పైన చంద్రబాబు తీసుకునే తుది నిర్ణయంపై ఉత్కంఠత నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement