Friday, April 26, 2024

తెలుగు కళాకారుడికి అరుదైన గుర్తింపు.. రిపబ్లిక్ డే వేడుకల్లో సుధీర్ కలంకారీ హ్యాండ్ పెయింటింగ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత గణతంత్ర వేడుకల్లో ఈ ఏడాది ప్రదర్శించనున్న భారీ కలంకారీ తెరలపై తెలుగు కళాకారుడి చిత్రాలు కనువిందు చేయనున్నాయి. భారతదేశ వైవిధ్యాన్ని చాటిచెప్పే జానపద కళారూపాలు సహా కళలను ప్రదర్శించేలా ఏర్పాటు చేసిన వేడుకల్లో పంజాబ్‌లోని రాజ్‌పురా చిట్కారా విశ్వవిద్యాలయంలోని కళాకుంభ్‌లో తయారైన భారీ స్క్రోల్ (తెర)లను గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించనున్నారు. రాజ్‌పథ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ గ్యాలరీలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ ఈ భారీ తెరలను ప్రదర్శనకు పెట్టనుంది. ఒక్కొక్కటి 750 మీటర్ల పొడవున్న భారీ తెరలపై 500 మందికి పైగా కళాకారులు అనేక కళారూపాలను చిత్రించారు. ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం కూడా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన కళాకారుడు సుధీర్ రూపొందించిన కలంకారీ కళ తెరపై ఉంటుంది. కలంకారీ అనేది సహజమైన రంగులను ఉపయోగించి, చింతపండు పెన్నుతో కాటన్ లేదా సిల్క్ వస్త్రంపై చేసే పురాతన శైలి చేతి పెయింటింగ్. కలంకారీ అనే పదం ఒక పర్షియన్ పదం నుండి ఉద్భవించింది. ‘కలం’ అంటే కుంచె లేదా కలం అని, ‘కరి’ అనే పదం కళాత్మకతను సూచిస్తుందని చరిత్రకారులు చెబుతారు. ఈ కళలో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్టార్చింగ్, క్లీనింగ్ ఇంకా శ్రమతో కూడిన 23 దశలు ఉంటాయి. కలంకారీలో గీసిన మోటిఫ్‌లు పువ్వులు, నెమలి, పైస్లీలు మొదలు మహాభారతం, రామాయణం వంటి హిందూ ఇతిహాసాల దైవిక పాత్రల వరకు విస్తరించి ఉంటాయి. ఈ రోజుల్లో ఈ కళ ప్రధానంగా కలంకారీ చీరల తయారీకి ఉపయోగిస్తున్నారు. సుధీర్ అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్న సంప్రదాయ కలంకారీ కళాకారుడు. హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయం నుంచి పెయింటింగ్‌లో బ్యాచిలర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ (బివిఎ) చేసిన సుధీర్ ఈ గణతంత్ర వేడుకల్లో తన కళను ప్రదర్శించనున్నారు.

ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement