Sunday, April 28, 2024

ఏపీలో జులై 26 నుంచి పదో తరగతి పరీక్షలు!

ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధమైంది. జులై 26 నుంచి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కరోనా వేళ పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జులై 26వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించే వాతావరణం ఉంటుందని ఏపీ విద్యా శాఖ భావిస్తోంది. మరో రెండు వారాల్లో పరిస్థితులు చక్కబడితే, జూలై మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

రాష్ట్రంలోని 6.28 లక్షల మంది విద్యార్థులు నాలుగువేలకుపైగా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. అయితే, ఈ ఏడాది 11 పేపర్లకు బదులుగా ఏడు పేపర్లు మాత్రమే నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణలో 80 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొననున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమీషనర్‌ చినవీరభద్రుడు పేర్కొన్నారు. గత ఏడాది కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందని, ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో కోవిడ్ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని నవీరభద్రుడు తెలిపారు. కాగా, రేపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్యాశాఖపై సమీక్షలో పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement