Friday, May 17, 2024

Tirupathi – వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం – పద్మపుష్కరిణిలో పవిత్రస్నానం

తిరుపతి నవంబరు 18, (ప్రభ న్యూస్ ప్రతినిధి): శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని, కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమి తీర్థం (చక్రస్నానం) అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారు జన్మించిన పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్రస్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. అంతకుముందు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి  ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమి తీర్థ మండపానికి వేంచేపు చేశారు. అదేసమయంలో తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 5.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా అర్చకులు పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి సారె ను సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 

  • అమ్మవారికి శ్రీవారి కానుక 
          శ్రీ  పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్బంగా తిరుమల శ్రీ  వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. రూ.2.5 కోట్లు విలువైన 5 కిలోల బరువు గల బంగారు కాసులమాల, శ్రీ సుందరరాజస్వామి వారికి యజ్ఞోపవీతాన్ని సారెతో పాటు తిరుప‌తి పుర‌వీధుల‌లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.
  • సిరులతల్లికి స్న‌ప‌న‌తిరుమంజ‌నం
    పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం వేడుకగా శోభాయమానంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం లతో  విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పచ్చ చామంతులు, యాలకులు, ఆఫ్రికన్ గ్రేప్స్, రెడ్, ఎల్లో రోజా పెటల్స్, వట్టివేరు, తులసిమాల‌లతో చేసిన కిరీటాలు భక్తులను కనువిందు చేశాయి. తిరుపూర్ కు చెందిన దాతలు అమ్మవారికి మాలలు, కిరీటాలను ప్రత్యేకంగా తయారు చేయించారు.
  • ఆకట్టుకున్న ఫలపుష్పం మండపం
    పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఒక టన్ను పుష్పాలతో ఏర్పాటుచేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో తామర పూలు, రోజాలు, లిల్లీలు తదితర 6 రకాల, కట్ ఫ్లవర్స్, 6 రకాల సంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 12 నుండి 12.10 గంటల మధ్య పంచమి 
    తీర్థం (చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించిన అనంతరం రాత్రి 9.30 నుండి 10.30 గంట‌ల సమయంలో శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం నిర్వహించారు. ఇదిలా ఉండగా ఈనెల19వ తేదీ ఆదివారం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి ఆలయంలో  పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నట్టు అలయ అధికారులు తెలిపారు.
  • వైభవోపేతంగా చక్రస్నానం: చైర్మన్
  • ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియా తో మాట్లాడారు. లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమితీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా 50 వేలకు పైగా భక్తులు అమ్మవారి పద్మసరోవరంలో చక్రస్నానం సమయంలో పుణ్యస్నానాలను ఆచరించారని తెలిపారు. ఇంకా వేలాదిమంది భక్తులు వస్తున్నారని, సాయంత్రం వరకు ఈ పుణ్యస్నాన వేడుక జరుగుతూనే ఉంటుందని వివరించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు. అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.  

    ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి,ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, చంద్రగిరి ఎంఎల్‌ఏ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పలువురు బోర్డు స‌భ్యులు, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం దంపతులు, సివిఎస్‌వో నరసింహ కిషోర్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్, సిఈ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవోలు గోవిందరాజన్, లోకనాథం ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement