Friday, April 26, 2024

మత మార్పిడులు చేయిస్తే చూస్తూ ఊరుకోం: సోము

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మ‌న‌ దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారిది, ఏపీ సీఎం జగన్ ది ఒకటే మనస్తత్వమ‌ని అన్నారు. బ‌లవంత‌పు మ‌త‌మార్పిడులకు, గోవధ నిషేధంపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా విజయవాడలో నిర్వహించిన ధర్నాలో సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్ర‌జ‌ల‌తో బ‌ల‌వంతంగా మత మార్పిడులు చేయిస్తుంటే త‌మ పార్టీ చూస్తూ ఊరుకోబోద‌ని స్పష్టం చేశారు. మతం మారాలంటూ ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఎస్సీలపై వైసీపీ నేతలు దాడి చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ర‌హ‌దారుల‌ అభివృద్ధికి క‌నీసం రూ.2 వేల కోట్లు కూడా కేటాయించలేని దుస్థితిలో స‌ర్కారు ఉంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. నవరత్నాలే తమ అభివృద్ధి అని వైసీపీ ప్ర‌భుత్వం చెప్పుకుంటోంద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అటువంటి వంద రత్నాలను ప్రజలకు అందించిందని చెప్పారు. ఏపీకి కేంద్రం చేసిన సాయంపై వైసీపీ నేత‌లు చ‌ర్చ‌కు రావాల‌ని సోము స‌వాలు విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement