Wednesday, May 1, 2024

AP: మండపాల పునరుద్దరణకు పురావస్తు అనుమతి తీసుకోవాలి : పురందేశ్వరి

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : పురావస్తు శాఖ అనుమతి తీసుకోకుండా పురాతన, ప్రాచీన మందిరాలు, మండపాలను తొలగించడం, పునరుద్దరించడం వంటి చర్యలు మంచిది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పష్టం చేశారు. ఈరోజు ఆమె టీటీడీ పునరుద్దరించ తలపెట్టిన అలిపిరి పాదాల మండపం సమీప పురాతన మండపాన్ని పరిశీలించారు. ఆ సందర్బంగా పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ… సవరించిన నిబంధనల మేరకు 75 ఏళ్లు పైబడిన నిర్మాణాలుభారత పురావస్తు శాఖ పరిధిలో ఉంటాయని తెలిపారు. అటువంటిది 550 ఏళ్లు పైబడిన పాదాల మండపం ప్రాంత నిర్మాణాలను పురావస్తు శాఖ అనుమతి లేకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. తిరుమలలో పురాతన పార్వేట మండపాన్ని తొలగించి ఇష్టానుసారంగా నిర్మాంచారని ఆరోపిస్తూ పునరుద్ధరణ పేరుతో తొలగించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు.


కనుక అలిపిరి వద్ద మండపాలను తొలగించాలంటే పురావస్తు శాఖ అనుమతితో తీసుకోవాలన్నారు.
భక్తులు హుండీలో వేసే కానుకలను సనాతన, ధర్మ పరిరక్షణకే మాత్రమే కేటాయించాలని అంటూ
ఒక శాతం నిధులంటూ టీటీడీ నుండి మున్సిపాలిటీకి ఇవ్వడం తప్పుపట్టారు. స్వామి వారి హుండీ నుండి ఒకశాతం నిధులు తీసుకోవడం చాలా దుర్మార్గమని అంటూ ఇటువంటి ప్రయత్నాలపై ఖచ్చితంగా దీనిపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలలోని దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యానికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement