Friday, April 26, 2024

ప్రజా చైతన్యంతోనే రాయలసీమ అభివృద్ధి.. న‌దుల్లో నీరు పారుతున్నా సీమలో క‌రువు తాండ‌వం!

ప్రజాచైతన్యంతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ఆదివారం నంద్యాలలో రైతు ప్రతినిధుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ కరువు భూమిగా మారడానికి ప్రజలలో వనరులు, సాగు, తాగునీటిపై అవగాహన లేకపోవడమే కార‌ణ‌మ‌న్నారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం సీమ అవసరాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధికి ఏయే నిర్మాణాలు, ప్రాజెక్టులు, ఏయే విధానాలను రూపొందించుకోవాలో అన్న విషయాలపై అవగాహన, ఆసక్తి లేని ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఉన్నారని విమర్శించారు. అన్ని పంటలు పండే భూమి, వాతావరణ పరిస్థితులు అంతకు మించి కష్టపడి పనిచేసే రైతులు, రైతుకూలీలు రాయలసీమ సొంతమని ఈ పుణ్యభూమికి దుర్భిక్ష ప్రాంతం అని ముద్ర వేసారని ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణా, పెన్నా, వాటి ఉపనదులు తుంగభద్ర, వేదవతి, హంద్రీ, చిత్రావతి, బహుళ, చెయ్యేరు, కుందూ నదులలో నీరు ప్రవహిస్తున్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాయ‌ల‌సీమ‌లో కరువు తాండవిస్తోందని దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నదికి ఎగువ ప్రాంతమైన రాయలసీమ రైతులకు సాగుకు నీటి విడుదల తేదీలను ప్రకటించని రాష్ట్ర ప్రభుత్వం నదికి దిగువన ఉన్న కృష్ణా డెల్టా పంటల సాగుకు రెండు రోజుల క్రితమే నీటి విడుదల చేసింద‌ని మండిప‌డ్డారు. రాయలసీమ అభివృద్ధికి జరుగుతున్న ఆటంకాలను, సాగు, తాగునీటిపై రైతులు గ్రామ స్థాయిలో అవగాహన చేసుకుని చైతన్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

సిద్దేశ్వరం అలుగు నిర్మిస్తే శ్రీశైలం రిజర్వాయర్ లో ఉన్న 60 టి.ఎం.సి ల నీటితో రైతులకు జూన్ మొదటి వారంలోనే ఖరీఫ్ సాగుకు నీటి విడుదల సాద్యమయ్యేదని అలుగు నిర్మాణం కోసం ఉద్యమం ఉదృతం చేస్తామని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో అనుమతులు ఉన్న తెలుగుగంగ, గాలేరు – నగరి, హంద్రీ నీవా, వెలిగొండ ప్రాజెక్టులతో పాటు గురు రాఘవేంద్ర, ముచ్చుమర్రి, సిద్దాపురం, మల్యాల ఎత్తిపోతల పథకాలకు ఏడేండ్ల అనంతరం అనుమతులు లేవనీ కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రకటించినా ఇదెక్కడి అన్యాయం అంటూ నిలదీయలేని ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు రాయలసీమలో ఉండటం దురదృష్టకరం అని దశరథరామిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విభజన చట్టంలో అనుమతులు ఉన్న అన్ని ప్రాజెక్టులకు చట్టబద్ద నీటిహక్కును కాపాడుకోవాలని దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఇస్తున్న 80 టీఎంసీల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ లో నిల్వ వుంచి రాయలసీమ ప్రజలకు త్రాగు, సాగునీరు సకాలంలో నీరందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement