Friday, May 17, 2024

RRR కుమారుడు భరత్ పిటిషన్ పై సుప్రీం విచారణ..

తన తండ్రిని ఏపీ సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో వేధించారని ఎంపీ రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. భరత్ పిటిషన్ ను జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారించింది. భరత్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించారు.

కస్టడీలో రఘురామను చిత్రహింసలకు గురిచేయడంపై సీబీఐ దర్యాప్తును కోరుతున్నామని రోహాత్గీ సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. అంతేకాకుండా, ప్రతివాదుల జాబితా నుంచి ఏపీ ప్రభుత్వం, డీజీపీని తొలగించేందుకు కోర్టు అనుమతి కోరారు. రోహాత్గీ విజ్ఞప్తి మేరకు ప్రతివాదుల జాబితాలో మార్పులకు సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో, తమను ప్రతివాదుల జాబితా నుంచి తప్పించడం పట్ల ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement