Sunday, May 19, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ తో రైతులు గోడు – అన్న‌దాత‌కు అండ‌గా ఉంటామ‌న్న జ‌న‌సేనాని

రాజ‌మండ్రి – “పంట నష్టం వాటిల్లితే అధికారుల నుంచి కనీసం పలకరింపు లేదు.. రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే వైసీపీ పాలకులు ఎక్కడ ఉన్నారు.. రైతుకు ఎక్కడ కష్టం వస్తే అక్కడ మేముంటామని చెప్పారు.. ఇప్పుడు అకాల వర్షాలకు పంట నష్టపోతే పట్టించుకున్న దిక్కు లేదు. ముఖ్యమంత్రి గారు రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ప్రకటించారు. ఆ నిధి ఏమయ్యిందో ప్రభుత్వంలో ఉన్న వారికే తెలియాలి. వర్షాలు, వరదలు వచ్చి రైతులు కష్టాల్లో ఉంటే ఆ డబ్బు ఎక్కడ దాచుకున్నారు? ఎకరాకి రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చు అయ్యింది. అకాల వర్షాలకు ఎకరాకి 20 బస్తాలు పైనే నష్టపోయాం. ధాన్యం నల్లపాయ వచ్చేసింది. మాకు వ్యవసాయం తప్ప మరో పని చేతకాదు. మద్దతు ధర రూ.1530 ఉంటే మిల్లర్ల ద్వారా కొనుగోలు చేస్తూ తరుగు పేరిట బస్తాకి రూ. 200 వరకు కోత పెడుతున్నారు. ఆ ఖర్చులు ఈ ఖర్చులు రైతుల నెత్తినే వేస్తున్నారు. బస్తాకి రూ. 1200 నుంచి రూ. 1300 మాత్రమే వస్తోంది. మొలక వచ్చిన ధాన్యం, తడిసిన ధాన్యాన్ని అస్సలు కొనడం లేదు. రైతు పండించిన ధాన్యాన్ని మాత్రమే కొనమని అడుగుతున్నాం. మొదట 33 బస్తాలు కొంటామన్నారు. రైతులంతా ధర్నా చేస్తే ఇప్పుడు కొంత పెంచారు అంటూ రైతులు త‌మ గోడును జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు చెప్పుకున్నారు… రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించి ప‌వ‌న్ క‌ల్యాణ్ మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు..


రైతు భరోసా కేంద్రాలకు చెందిన వాళ్లు, స్థానిక నాయకులు వచ్చి ఒక వంతు ధాన్యం వెళ్లిపోయింది.. మూడొంతుల ధాన్యం వెళ్లిపోయిందని చెబుతున్నారు. ధాన్యం ఇంకా చాలా వరకు కళ్లాల్లోనే ఉంది. మీకు చూపాలనే లోడు చేసిన లారీలు అడ్డుకున్నాం. చివరికి కాలువల్లో పూడిక మేమే తీసుకుంటున్నాం. మరమ్మతులు మేమే చేసుకుంటున్నాం. ఆవలో ఖరీఫ్ మొత్తం నీళ్లలోనే మునిగి ఉంటుంది. రబీ ఒక్కటే మిగిలేది. ఇప్పుడు అకాల వర్షాలకు అదీ పోయింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల కష్టాలు ఓపికగా ఆలకించిన పవన్ కళ్యాణ్ పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజమండ్రి నగరం – బొమ్మూరు – రాజవోలు మీదుగా రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలోని ఆవ భూములలో దెబ్బ తిన్న వ్యవసాయ భూములు పరిశీలించి రైతులను మాట్లాడారు పవన్‌.
ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement