Thursday, April 25, 2024

యువ‌గ‌ళం – త‌ల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కుప్పం బ‌య‌లుదేరిన లోకేష్..

హైద‌రాబాద్ – టీడీపీ యువనేత‌, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రనుఈ నెల‌ 27వ తేదీ నుంచి కుప్పం నుంచి ప్రారంభించ‌నున్నారు.. ఈ నేప‌థ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మానాన్ననారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, అత్తమామలు నందమూరి బాలకృష్ణ, వసుంధర నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు లోకేష్. ఇక ఆయన సతీమణి నారా బ్రాహ్మణి హారతి పట్టి, బొట్టు పెట్టి, విషెస్ చెప్పారు. అక్క‌డి నుంచి నుంచి లోకేష్ నేరుగా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. అటు నుంచి కడపకు బ‌య‌లుదేరారు. అక్కడి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు . అదే సమయంలో కడపలోనే ఓ చర్చ్ లోనూ లోకేష్ ప్రార్థనలు చేస్తారు. రాత్రికి తిరుమలకు చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం నాడు శ్రీవారిని దర్శించుకుంటారు . ఉదయం 10 గంటలకు తిరుమల నుంచి కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకుంటారు. 27వ తేదీ నుంచి కుప్పం నుంచి తన యువగళం పాదయాత్రను ప్రారంభిస్తారు.

అశీర్వ‌దించండి – ప్ర‌జ‌ల‌కు విన‌తి..
పాదయాత్రకు ముందు ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేశారు. తనను ఆశీర్వదించాలంటూ ప్రజలను కోరారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం పాలనను బేరీజు వేస్తూ.. అభివృద్ధి పనులు, పాలనా విధానాలను పేర్కొన్నారు. టీడీపీకి మరోసారి అధికారం ఇచ్చి.. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు లోకేష్.
లోకేష్ బహిరంగ లేఖ సారాంశం..
‘లోటు బ‌డ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం గాడిలో పెట్టి, న‌వ్యాంధ్ర నిర్మాణానికి చాలా కృషి చేసింది. ఈ విషయం మీకు తెలిసిందే. జ‌గ‌న్ నేతృత్వంలోని ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంసం మీరంతా చూస్తూనే ఉన్నారు. ప్రతివర్గం మాకొద్దీ అరాచ‌క‌పాల‌న అంటూ ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప‌రిశ్రమ‌లు ఎలాగూ రావ‌డంలేదు. ఉన్నవీ త‌రిమేస్తున్నారు. కుల‌, మ‌త‌, ప్రాంతాల పేరుతో విద్వేషాలు ఎగ‌దోసి వికృత రాజ‌కీయానికి తెర‌లేపారు. ఈ అరాచక పాలన పోవాలి. అందుకే మీ ముందుకు వస్తున్నాను. యువ‌త‌కి భ‌విత‌న‌వుతాను. అభివృద్ధికి వార‌ధిగా నిలుస్తాను. రైత‌న్నని రాజుగా చూసేవ‌ర‌కూ విశ్రమించ‌ను. ఆడబిడ్డలకు సోద‌రుడిగా ర‌క్షణ అవుతాను. మీరే ఒక ద‌ళ‌మై, బ‌ల‌మై నా యువ‌గ‌ళం పాద‌యాత్రని న‌డిపించండి. మీ అంద‌రి కోసం వ‌స్తున్న న‌న్ను ఆశీర్వదించండి.. ఆద‌రించండి.’ అంటూ ప్రజలను కోరారు నారా లోకేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement