Friday, April 26, 2024

నా తల్లిపై ఆరోప‌ణ‌లు చేస్తారా?.. మీరు మ‌నుషులేనా?: వైసీపీపై లోకేశ్ ఫైర్

ఇటీవల ఏపీలో సంభవించిన వరదల్లో మృతి కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్టు తరపున టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు భార్య‌ నారా భువనేశ్వరి రూ.లక్ష చొప్పున సాయం అందజేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమెపై ప‌లువురు వైసీపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకుంటే నా త‌ల్లిని అవ‌మానిస్తారా? అంటూ మండిపడ్డారు. తన తండ్రి మాదిరిగా తాను మెత‌క వైఖ‌రిని అవ‌లంబించ‌ను అని అన్నారు. తన త‌ల్లిపై ఆరోప‌ణ‌లు చేసిన వారిని తాను త‌గి బుద్ధి చెబుతానని లోకేశ్ హెచ్చరించారు. వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవడానికి మీరు ఏం చేశారని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. ‘’మీరా నా త‌ల్లిపై ఆరోప‌ణ‌లు చేసేది. ఒళ్లు ద‌గ్గర‌పెట్టుకోండి. నేను చెబుతున్నా.. మీరు ఎక్క‌డ ఉన్నా నేను వ‌ద‌లి పెట్ట‌ను.. నా తండ్రి వ‌దిలి పెడ‌తారేమో.. ఆయ‌నది చాలా పెద్ద మ‌న‌సు. నేను మాత్రం వ‌ద‌లిపెట్ట‌ను. నా త‌ల్లిపై ఆరోప‌ణ‌లు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల‌కు త‌గి బుద్ధి చెబుతాను. మీ త‌ల్లుల గురించి కూడా మీరు ఇలా మాట్లాడ‌తారా? మీ భార్య గురించి, మీ కూతుళ్ల గురించి కూడా ఇలాగే మాట్లాడ‌తారా?’ అని నారా లోకేశ్ హెచ్చ‌రించారు.

వైసీపీ నేత‌లు అస‌లు మ‌నుషులేనా? ప‌శువులా? అని వ్యాఖ్యానించారు.వ‌ర‌ద మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి, నా త‌ల్లి రూ.ల‌క్ష చొప్పున సాయం చేశారని చెప్పారు. బాధితుల కోసం తన తల్లి కోటి రూపాయ‌లు ఖ‌ర్చుపెట్టిందన్న లోకేశ్.. వ‌ర‌దల స‌మ‌యంలో వైసీపీ నేత‌లు విదేశాల్లో ఎంజాయ్ చేశారని విమర్శించారు. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో పేకాట ఆడుతూ కూర్చున్నారని లోకేశ్ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement