Monday, April 29, 2024

Cpi Narayana : ఎంపీ కుటుంబం కిడ్నాప్.. విచారణ కోరుతూ అమిత్ షాకు లేఖ

వైసీపీ ఎంపీ సత్యనారాయణ ఇంట్లో కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ వివిధ రకాల మాఫియాకు, సంఘ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిందని అమిత్ షా చెప్పారని తెలిపారు. అమిత్ షా వచ్చి వెళ్ళిన మూడు రోజులకే వైసీపీ ఎంపీ సత్యనారాయణ ఇంట్లో కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగిందన్నారు.

ఒక ఎంపీ ఇంట్లో దుండగులు ప్రవేశించి, మూడు రోజులు తిష్ట వేసి గంజాయి మాదక ద్రవ్యాలు వాడారని పేర్కొన్నారు. దుండగులకు, ఎంపీ సత్యనారాయణకు మధ్య అనేక వ్యవహారాల్లో సంబంధాలు ఉన్నాయని, ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోకూడదన్నారు. వైసీపీ ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తుందని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలని పేర్కొన్నారు. విశాఖలో అనేక కీలకమైన సంస్థలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు విశాఖ వ్యవహారంలో ఏమి చేయలేరని వెల్లడించారు. కేంద్ర హోం శాఖ నిజానిజాలు నిగ్గు తేల్చాలన్నారు. కేంద్ర హోంమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement