Friday, May 3, 2024

YS Viveka Murder Case: నిరూపిస్తే మేమంతా రాజీనామా చేస్తాం: రాచమల్లు సంచలన ప్రకటన

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన విషయాలు చెప్పారు. ఈ క్రమంలో వైఎస్ వివేకా హత్యపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు, అనుమానం, వ్యక్తిగత బలహీనతలే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణాలని ఆయన అన్నారు. వివేకా హత్యతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. ఒకవేళ ఉందని నిరూపిస్తే తనతో సహా జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని ప్రకటించారు. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి తొలుత ఇచ్చిన వాంగ్మూలానికి, ఆ తర్వాత ఇచ్చిన దానికి పొంతన లేదన్నారు. సిట్, సీబీఐ దర్యాప్తులో భాగంగా ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం 161లో అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిల పేర్లు లేవన్నారు. కానీ ఆ తర్వాత ప్రొద్దుటూరు కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం 164లో మాత్రం ఆ నలుగురి పేర్లను చేర్చారని చెప్పారు. వివేకా హత్యలో పాల్గొన్నట్టు చెప్పిన డ్రైవర్ దస్తగిరిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని రాచమల్లు ప్రశ్నించారు. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చేందుకే హైకోర్టులో పిటిషన్ వేశారని విమర్శించారు. ముద్దాయిని సాక్షిగా మార్చాలనుకోవడం సరికాదని ఎమ్మెల్యే రాచమల్లు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/andhraprabhanewsdaily

https://twitter.com/AndhraPrabhaApp,

Advertisement

తాజా వార్తలు

Advertisement