Friday, April 26, 2024

‘గంగమ్మ తల్లి’కి సారె సమర్పించిన మంత్రి ఆర్కే రోజా

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరలో భాగంగా గంగమ్మ తల్లికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా శనివారం ఉదయం సారె సమర్పించారు. స్థానిక నడి వీధి గంగమ్మ ఆలయం వద్ద నుంచి వూరేగింపుగా సారె తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి స్వాగతం పలికి, ఆలయంలోకి తీసుకెళ్లారు. మంత్రి రోజాకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి రోజా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారికి సారె సమర్పించడం తన పూర్వ జన్మ సుకృతం అని మంత్రి రోజా అన్నారు. ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన అమ్మవారి మహిమల గురించి అందరికీ తెలుసని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అభ్యర్థన మేరకు ఈరోజు అమ్మవారికి సారి సమర్పించానని చెప్పారు. గంగమ్మ ఆలయానికి తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర ఉందన్నారు. సాక్షాత్తు అనంతాచార్యులు స్వాములవారు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారని తెలిపారు. జాతర ఈ ఆలయం నుంచి ప్రారంభం అయిందన్నారు. గతంలో తిరుమల కొండకు ఎవరైనా రావాలనుకుంటే… ముందుగా గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని తర్వాతే వెళ్లేవారని గుర్తు చేశారు. ఇక మీదట కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. జాతరను పురస్కరించుకుని తిరుపతి సమీప ప్రాంతాల ప్రజలంతా అమ్మవారికి సారె సమర్పించుకుని, తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటారని వివరించారు. గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు మంత్రి రోజా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement