Sunday, April 28, 2024

Mandapet – రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసమే నేను, పవన్ కలిశాం – చంద్ర బాబు

” ఇవాళ నేను రా కదలిరా అని పిలుపునిచ్చాను. ఇది నా కోసం కాదు. దగా పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ఒక రైతు కోసం, ఒక కూలీ కోసం, ఒక నిరుద్యోగి కోసం… రాష్ట్ర మంతా కదలి రావాలని పిలుపునిచ్చాను. అందుకు మీరంతా స్పందించారు. ఇది నా కోసమో, పవన్ కల్యాణ్ కోసమో కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత” అని టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు

కోనసీమ జిల్లా మండపేటలో రా కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కోనసీమ ఎంతో అందమైన ప్రదేశం అని అభివర్ణించారు. నిన్ననే కోడిపందాలు కూడా జరిగాయని, అతిథి మర్యాదలకు మారుపేరు ఈ కోనసీమ అని కొనియాడారు. మంచి నీళ్లు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి మనసున్న మనుషులు ఇక్కడివారు అని వివరించారు.

డొక్కా సీతమ్మ వంటి మహనీయురాలు ఇక్కడి గడ్డపైనే పుట్టిందని, ఎవరైనా అన్నం అడిగితే లేదనకుండా వారి కడుపునింపిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని చంద్రబాబు పేర్కొన్నారు. గన్నవరం అక్విడెక్ట్ కు ఆమె పేరే పెట్టామని వెల్లడించారు. ఇక రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ… ఈసారి అమలాపురం పార్లమెంటు స్థానం పరిధిలోని 7 సీట్లనూ టీడీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆత్రేయపురం అంటే పూతరేకులు గుర్తొస్తాయని, ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతంలోనూ చిచ్చుపెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దాడులు, కేసులు, ఆత్మహత్యలతో కోనసీమ ప్రాంతాన్ని హింసకు కేంద్రంగా మార్చేశారని విమర్శించారు. ..

మొన్ననే కోనసీమలో ఇంటర్నెట్ నిలిపివేశారంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. 45 ఏళ్లుగా ఎన్నడూ చూడని విచిత్రాన్ని ఈ వైసీపీ సైకో పాలనలోనే చూస్తున్నాం అని వ్యాఖ్యానించారు. “ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎప్పుడూ కూడా పౌరుషంగా మాట్లాడని మీరు… ఇవాళ అరాచకాలు, రౌడీయిజం చూస్తున్నారు. కోనసీమను మరో పులివెందుల చేయాలనుకుంటున్నారు. పులివెందులనూ మార్చుతాం గానీ, కోనసీమలో మీ రౌడీయిజం జరగనివ్వనని మండపేట నుంచి మరొక్కసారి చెబుతున్నాను. ఐదేళ్లయిపోయింది. ఈ పార్టీ (వైసీపీ) మళ్లీ గెలిచే పరిస్థితే లేదు. ఈ పార్టీ మళ్లీ వస్తే ఏ ఒక్కరు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి ఉండదు” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

దళితులకు తానేదో చేశానని సీఎం గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు.

- Advertisement -

. “అప్పట్లో అంటరానితనం ఉండేది, రెండు గ్లాసుల విధానం ఉండేది. దీనిపై అధ్యయనం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాం. దళితుల వెతలపై ఆయన ఓ నివేదిక ఇచ్చారు. ఎంతో అధ్యయనం చేసి 12 జీవోలు తీసుకువచ్చి, దళితుల అభ్యున్నతికి చర్యలు తీసుకున్నాం. అంతేకాదు, మహనీయుడు అంబేద్కర్ కు భారతరత్న వచ్చింది ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడేనని గుర్తించాలి.

ఈ ప్రాంతానికి చెందిన జీఎంసీ బాలయోగిని లోక్ సభ స్పీకర్ గా నామినేట్ చేసింది టీడీపీనే. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా నామినేట్ చేశాం. దళిత వర్గానికి చెందిన కాకి మాధవరావును సీఎస్ గా నియమించాం. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీగా మరో ఎస్సీ వ్యక్తి వచ్చిన దాఖలాలు లేవు. కేఆర్ నారాయణన్ ను రాష్ట్రపతిగా ప్రతిపాదించింది మేమే. దళితులను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ది చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నాం.

కానీ ఈ ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకి. దళితుల కోసం మేం తీసుకువచ్చిన 27 పథకాలను రద్దు చేశారు.. సబ్ ప్లాన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసారు.. దళితుల కోసం ఖర్చు చేయాల్సిన రూ.28 వేల కోట్లను ఎక్కడికక్కడ దారి మళ్లించారు.. ఇతని అహంకారం ఎక్కడివరకు వెళ్లిందంటే… అంబేద్కర్ విదేశీ విద్య పథకం పేరును మార్చివేసి జగన్ విదేశీ విద్య అని పెట్టుకున్నారు.. దళిత ద్రోహి ఈ జగన్ మోహన్ రెడ్డి. ఈయనొక పెద్ద పెత్తందారు. ఎవరూ మాట్లాడ్డానికి వీల్లేదు. దళితులు నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడకూడదు. ఎవరైనా నోరు విప్పితే వారిపై దాడులు, గొంతు నొక్కే పరిస్థితికి వచ్చారు. . నాలుగున్నరేళ్లలో దళితులపై 6 వేలకు పైగా దాడులు జరిగాయి. 188 మంది దళితులు హత్యకు గురయ్యారు” అంటూ చంద్రబాబు వివరించారు.

కోడికత్తి డ్రామా ఆడి గత ఎన్నికల్లో సానుభూతి తెచ్చుకుని, కోడికత్తి శ్రీనివాస్ ను జైలుకు పంపారని విమర్శించారు. పెద్ద తప్పు చేయనివాడు జైల్లో ఉన్నాడు… బాబాయ్ ని చంపినవాడు మాత్రం బయట తిరుగుతూ, ఊరేగింపులు చేసుకుంటున్నారని మండిపడ్డారు. “ఈ రెండు విషయాల్లోనూ సింపతీ సంపాదించుకున్నారు . సానుభూతితో ఓట్లు వేయించుకున్నారు.. కానీ ఈరోజు… అక్కడ హత్య చేసిన వాడ్ని కాపాడతారు., నేరం చేయని వ్యక్తిని ఐదు సంవత్సరాలుగా జైల్లో పెట్టారు..

ఈ జిల్లాలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉదంతం కూడా మీకు తెలుసు. చంపిన ఎమ్మెల్సీకి ఊరేగింపులు నిర్వహిస్తారు. దళితుడ్ని చంపి డోర్ డెలివరీ పంపించారు. దీనిపై ఇంతవరకు చర్యలు లేవు. మా అక్కకు అన్యాయం చేయొద్దండీ, వేధించొద్దండీ అని ఓ బీసీ కుర్రాడు (అమర్నాథ్) అడిగితే అతడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. అమరావతిలో దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దళితులను ఇంత నిర్వీర్యం చేసి, దళితులను పథకం ప్రకారం నాశనం చేసిన వ్యక్తి… ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితులను ఉద్ధరిస్తాను, సామాజిక న్యాయం చేస్తాను అంటే ఎవరైనా నమ్ముతారా?” అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు

.

Advertisement

తాజా వార్తలు

Advertisement