Saturday, May 11, 2024

AP: మెజిస్ట్రేట్ ప్రాణాలకే జ‌గ‌న్ పాల‌న‌లో దిక్కులేదు… అచ్చెన్నాయుడు

మంగ‌ళ‌గిరి – ముఖ్యమంత్రి జగన్ కు తన భద్రతపైనే తప్ప శాంతిభధ్రతలపై శ్రద్ధ లేదని టీడీపీ ఏపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. తహశీల్దార్ రమణయ్య హత్యపై ఆయ‌న స్పందిస్తూ,ఈ హ‌త్య‌తో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని తేట‌తెల్ల‌మైంద‌న్నారు.

మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, విశాఖ జిల్లా కొమ్మాదిలో తహశీల్దార్ ఇంట్లోకి వెళ్లి మరీ ఆయనను చంపేశారని చెప్పారు. మండల మేజిస్ట్రేట్ కే ఈ దుర్గతి పడితే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రశాంతతకు నిలయమైన ఉత్తరాంధ్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి దారుణం జరగలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ‘రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాగం’ అమలవుతోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తహసీల్దార్ రమణయ్య హత్యపై వెంటనే విచారణ జరిపించి, దోషులను పట్టుకుని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

ఐదేళ్లలో భూకజ్జాలు, ఆస్తుల విధ్వంసం, కమీషన్లు, సెటిల్ మెంట్లకు అడ్డాగా విశాఖను మార్చేశారని అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో ప్రజలు, అధికారులపై బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, శిరోముండనాలు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అవినీతి, అరాచకాలకు అడ్డుతగిలిన అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారని, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయ ఉద్యోగులపై వైసీపీ నాయకులు, వాలంటీర్ల దాడులు, దౌర్జన్యాలకు లెక్కేలేదని విచారం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజల ఆస్తులకే కాదు, వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఇంతటి ఘోరాలు నేరాలు జరుగుతుంటే హోంమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, వేధించడానికి మాత్రమే పోలీసులను ఉపయోగించుకుంటున్నారని సీఎం జగన్ పై అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement