Monday, April 29, 2024

మహానంది క్షేత్రంలో చోరీ..

మహానంది క్షేత్రంలో బుధవారం ఉదయం చోరీ జరిగింది. కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తులు మహానంది క్షేత్రానికి వచ్చారు. ఆలయంలోనికి ప్రవేశించే ముందు భక్తులు సాధారణంగా తమ దగ్గరున్న సెల్ ఫోన్స్, బ్యాగులు లేదా విలువైన వస్తువులు లాకర్లలో భద్రపరిచి రసీదు పొందుతారు. అయితే ఒక భక్త బృందం తమ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాకర్ లో భద్రపరిచి తగు రసీదు పొంది ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. అనంతరం రసీదును తమ వెంట తెచ్చుకున్న ఓ చిన్న బ్యాగులో ఉంచి కోనేరులో స్నానం చేయడానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ఒక దొంగ బ్యాగు తస్కరించి అందులో ఏమున్నాయో అని పరిశీలించి సెల్ ఫోన్ కు సంబంధించిన రసీదు ఉండడంతో అది తీసుకొని సెల్ ఫోన్ భద్రపరిచిన గది వద్దకు వెళ్లి అక్కడ రసీదు ఇచ్చి సెల్ ఫోన్లు కూడా తస్కరించి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. కోనేటిలో స్నానం అనంతరం చూసుకోగా తమ బ్యాగ్ గురించి ఆరా తీయడంతో పాటు సెల్ ఫోన్ భద్రపరచిన స్టాండ్ వద్దకు వచ్చి ఆరా తీసినట్టు తెలుస్తోంది. బ్యాగ్ లో 11 వేల రూపాయలు నగదు కూడా ఉన్నట్లు సమాచారం.

ఆలయ సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నా ఏమీ ప్రయోజనం..
భద్రత కారణాల దృష్ట్యా గతంలో హోం గార్డులను షిఫ్ట్ పద్ధతిలో ఇద్దరు చొప్పున నియమించేవారు. కానీ ఆ పద్ధతి పోయి ఒక్కరితో సరిపెట్టుకున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. హోంగార్డుల జీతాలు చెల్లించడానికి దేవస్థానం అధికారులు నిరాకరించడంతో హోంగార్డుల సంఖ్య నాలుగు నుండి ఒకటికి పడిపోయినట్లు తెలుస్తుంది. అధికారులు వింత ధోరణితో తరచూ ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీసీ పూటేజిని పరిశీలిస్తే దొంగ దర్జాగా తమ సొత్తు అయినట్లు రాజమార్గంలో తీసుకొని పోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement