Friday, April 26, 2024

పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ : ఎన్నికల అబ్జర్వర్ మురళీధర్ రెడ్డి

కర్నూల్ : భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎలాంటి పొరపాట్లకు కూడా తావివ్వకుండా పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ చేయాలని ఎన్నికల అబ్జర్వర్ మురళీధర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ -2023 పై జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తో కలిసి ఓటరు జాబితా అబ్జర్వరు డి. మురళీధర్ రెడ్డి ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఎలక్టోరల్ రోల్ అప్డేట్ చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం జరుగుతోందన్నారు. వంద శాతం ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు అబ్జర్వర్ జిల్లాలో మూడు సార్లు పర్యటించడం జరుగుతుందని, అందులో భాగంగానే ఈ రోజు రావడం జరిగిందన్నారు. మరల రెండవ సారి డిస్పోజల్ ఆఫ్ క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్ ప్రక్రియ డిసెంబర్ 9 నుండి డిసెంబర్ 26 వరకు జరిగే సమయంలో నూ, అదే విధంగా వర్కింగ్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ ఫైనల్ లిస్ట్ ప్రక్రియ డిసెంబర్ 27 నుండి జనవరి 4 వరకు జరిగే సమయంలో హాజరు కావడం జరుగుతుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువత పై ప్రత్యేక దృష్టి పెట్టి ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ కళాశాలల్లో క్యాంపెయిన్ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.క్షేత్ర స్థాయిలో ఆధార్-ఓటర్ కార్డు అనుసంధానం చేసే కార్యక్రమం జరుగుతుందని, అను సంధానం వల్ల డూప్లికేట్ ఓట్ల కు అవకాశం ఉండదని అన్నారు.ఇది స్వచ్ఛందం అని తెలిపారు.. ఏవైనా సమస్యలుంటే తెలియచేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ బిఎల్ వోలతో సమన్వయం చేసుకునేందుకు వీలుగా రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్ లను నియమించుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఎలక్షన్ సూపరింటెండెంట్ మురళి, రాజకీయ పార్టీల ప్రతినిథులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement