Saturday, May 11, 2024

భ‌య‌పెట్టి గెలిస్తే అది ఓట‌మేః వైసిపికి టిడిపి కౌంట‌ర్

నూజివీడు… ప్రజాస్వామ్య దేశంలో, అధికార వైఎస్ఆర్సిపి బెదిరింపులు దాడులు హేయమైన చర్యగా నూజివీడు టిడిపి ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నూజివీడు టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముద్దరబోయిన మాట్లాడుతూ నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను బెదిరించి భయపెట్టడం దారుణం అన్నారు. భయపెట్టి ప్రకటించుకునే ది గెలుపు కాదని, ప్రజల మద్దతుతో విజయం సాధించాలని సూచించారు. 32 వార్డులకు గాను 32 మంది తెలుగుదేశం అభ్యర్థులను పోటీలో ఉంచామని, 24, 30 వార్డ్ లో బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ చేయించారని, 2వ వార్డుకు సంబంధించి ఎదురేశి ఎరకయ్య పచ్చ చొక్కా మీద సిగ్గులేకుండా వైసీపీ కండువా కప్పుకున్నారని విమర్శించారు. బి ఫారం ఇచ్చిన తరువాత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధికార వైసిపి ఎమ్మెల్యే, ఆయన తనయుడు బెదిరింపులకు భయపడి ఎరకయ్య వైసీపీలో చేరిన ట్లు తెలిపారు.నూజివీడు మున్సిపాలిటీ లో టిడిపి విజయం కళ్ళకు కనిపించడంతో, అధికార పార్టీకి చెందిన నేతలు బెదిరింపులకు తెగబడ్డారని ముద్దరబోయిన ఆరోపించారు. బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడుతున్న విషయమై అధికార పార్టీ నేతల పై ఫిర్యాదు చేస్తే డీఎస్పీ, సిఐలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్రజాస్వామికంగా జరిగే ఏకగ్రీవాలు సిగ్గుమాలిన చర్య గా ముద్దరబోయిన అభివర్ణించారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సి హెచ్ ఎన్ వి కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement