Thursday, May 2, 2024

AP | ఉత్కంఠ భరితంగా అండర్–19 టోర్నీ..

  • అండర్ – 19 అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ
  • భారత్ (బీ)పై భారత్ (ఏ), బంగ్లాదేశ్ పై ఇంగ్లండ్ జట్ల విజయం

ఇబ్రహీంపట్నం, ప్రభన్యూస్ : మూలపాడు స్టేడియంలో ఈ నెల 13వ తేదీ నుంచి బీసీసీఐ ఆధ్వర్యంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పర్యవేక్షణలో జరుగుతున్న అండర్ – 19 పురుషుల అంతర్జాతీయ క్వాడ్రాంగ్యులర్ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ఐదో రోజుకు చేరింది. డీవీఆర్ మైదానంలో భారత్ (ఏ), భారత్ (బీ) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ (ఏ) జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్ (ఏ) జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత్ (బీ) జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 375 పరుగులు చేసింది. జట్టులోని రుద్రమయూర్ (134 బంతుల్లో, 10×4, 7×6) 164 పరుగులు, సచిన్ దాస్ (112 బంతుల్లో, 10×4, 7×6) 135 పరుగులు చేశారు. భారత్ (ఏ) జట్టులోని మురుగన్ ఏడు ఓవర్లలో రెండు వికెట్లు, సౌమ్య కుమార్ పది ఓవర్లలో ఒక వికెట్ తీసుకున్నారు.

376 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ (ఏ) జట్టు 46.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని అరవెల్లి అవనీష్ (93 బంతుల్లో 12×4, 12×6) 163 పరుగులు, మురుగన్ అభిషేక్ (62 బంతుల్లో 8×4, 1×6) 81 పరుగులు సాధించారు. భారత్ (బీ) జట్టులోని ప్రేమ్ 9.3 ఓవర్లలో మూడు వికెట్లు, విఘ్నేష్ 9 ఓవర్లలో మూడు వికెట్లు తీసుకున్నారు. భారత్ (ఏ) జట్టులోని అరవెల్లి అవనీష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు ఎంపికయ్యారు.

13 పరుగులతో ఇంగ్లండ్ విజయం

- Advertisement -

సీపీ మైదానంలో ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. జట్టులోని హంజా షేక్ (119 బంతుల్లో 14×4, 5×6) 126 పరుగులు, నోహ్ థైన్ (113 బంతుల్లో 7×4, 2×6) 88 పరుగులు చేశారు.

బంగ్లాదేశ్ బౌలర్లు ఎం.డి.ఇక్బాల్ హసన్ ఎమోన్ పది ఓవర్లలో 62 పరుగులిచ్చి 4 వికెట్లు, మరుఫ్ మృధా తొమ్మిది ఓవర్లలో 71 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 49.3 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని షేక్ పెవెజ్ జిబోన్ (39 బంతుల్లో 5×4, 4×6) 60 పరుగులు, ఎం.డి.అషికుర్ రెహమాన్ (72 బంతుల్లో 6×4, 2×6) 62 పరుగులు, అహ్రార్ అమీన్ (70 బంతుల్లో 6×4, 2×6) 66 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు ఎడ్వర్డ్ జాక్ 8.3 ఓవర్లలో 57 పరుగులిచ్చి ఐదు వికెట్లు, మిచెల్ కిలీన్ 8 ఓవర్లలో 56 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లండ్ జట్టులోని హంజా షేక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు ఎంపికయ్యారు. బంగ్లాదేశ్ జట్టు 0 పాయింట్ లో ఉండగా ఇంగ్లండ్ జట్టుకు 2 పాయింట్లు లభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement