Sunday, May 5, 2024

AP: జగన్ అరాచక పాలనతో ఏపీ బ్రాండ్‌కు తీరని దెబ్బ – నారా లోకేష్

(ఆంధ్రప్రభ , అమరావతి) – జగన్ అరాచక పాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, జె-ట్యాక్స్, కక్షపూరిత విధానాల కారణంగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అమర్ రాజా వంటి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయని టీడీపీ నేత నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లి అపర్ణ అపార్ట్ మెంట్ లో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో అక్కడ ప్రజలను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… 2014లో రాష్ట్ర విభజన తర్వాత కనీసం నిలువ నీడ కూడా లేని ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు అహోరాత్రులు శ్రమించి గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ధీటుగా తీర్చిదిద్దారు. ఒక్కఛాన్స్ మాయలో పడి జగన్ ను గెలిపించినందుకు నేడు 5కోట్ల మంది ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

జగన్ దెబ్బకు ఏపీలో తప్ప వెనుకబడిన రాష్ట్రాలకైనా వెళతామనే పరిస్థితికి పారిశ్రామికవేత్తలు వచ్చారు. దేశంలో వ్యాక్సిన్ తయారీలో అగ్రగామి సంస్థగా ఉన్న భారత్ బయోటెక్ ఒరిస్సాలో తమ యూనిట్ ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఖజానాకు అత్యధికంగా పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చే అమర్ రాజాను వేధించడంతో తెలంగాణాకు వెళ్లి యూనిట్ స్థాపించారు. దీని వల్ల అంతిమంగా నష్టపోయింది ఏపీలోని చదువుకున్న నిరుద్యోగ యువత. రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఈ ఆరాచక విధానాలకు ఓటుతో చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

- Advertisement -

అభివృద్ధే చంద్రబాబు లక్ష్యం…

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక్కో ఫోకస్ సెక్టార్ ను ఏర్పాటు చేసి ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేశారని వివరించారు. అనంతపురంలో ఆటోమొబైల్, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, కర్నూలులో సోలార్ ఎనర్జీ, విశాఖలో ఐటి, గోదావరి జిల్లాల్లో ఆక్వా, పామాయిల్.. ఇలా ప్రతిజిల్లాకు అక్కడ ఉన్న వనరులను గుర్తించి పరిశ్రమలను ప్రోత్సహించారన్నారు. ఫలితంగా చంద్రబాబు హయాంలో 40వేల పరిశ్రమలు, 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని జగన్ ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ ముందుకు నడిపించాలన్నది టీడీపీ విధానమని లోకేష్ వివరించారు.

అభివృద్ధి చేయకుండా ఎడాపెడా అప్పులు చేయడం వల్ల ఆ భారం రాష్ట్ర ప్రజలంతా మోయాల్సి వస్తుంద‌న్నారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది ఇదేన‌ని అంటూ ఈ సంక్షోభాలను సవాల్ గా స్వీకరించి అభివృద్ధికి బాటలు వేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని అన్నారు. 1995. 2014లో కూడా గడ్డు పరిస్థితుల్లోనే రాష్ట్రపగ్గాలు చేపట్టిన చంద్రబాబు నిరంతర అవిశ్రాంతంగా శ్రమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలెక్కించారని తెలిపారు.

జగన్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని ఎన్నికలయ్యాక చంద్రబాబు ఖచ్చితంగా గాడిలో పెడతారని ధీమా వ్య‌క్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమైందని, ఆఫీసుల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని లోకేష్ అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులను కూడా దొంగలుగా చిత్రీకరించి వేధింపులకు గురిచేశార‌ని, పదవీ విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని చెప్పారు.. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తి సౌకర్యాలతో సొంతభవనాలు నిర్మిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement