Sunday, April 28, 2024

AP – శరత్‌కు రిమాండ్ – జైలుకు తరలింపు…

విజయవాడ – జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.దీంతో పోలీసులు శరత్‌ను శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ సబ్ జైలుకు తరలించారు. గురువారం రాత్రి అరెస్టు అనంతరం శరత్‌ను పోలీసులు విజయవాడలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు..

శరత్‌ రిమాండ్ పై రెండు గంటలపాటు వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. శరత్‌ తరపున ఆయన న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇదే తరహా కేసు తెలంగాణలో కూడా నమోదు చేసినట్లు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఒకే తరహా నేరంపై రెండు ఎఫ్.ఐ.ఆర్ లు పెట్టడం నిబంధనలకు విరుద్దమని తెలిపారు.

కాగా, జీఎస్టీ ఎగవేత కేసులో గురువారం రాత్రి శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాచవరం పోలీసుస్టేషన్‌లో శరత్‌పై కేసు నమోదు అయింది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో సహా మొత్తం ఏడుగురుపై పోలీలు కేసు నమోదుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement