Sunday, May 5, 2024

19 రాష్ట్రాల‌కు గ్రాంట్ రిలీజ్‌.. తెలంగాణకు కేంద్రం ఏమియ్య‌లే… ఏపీకి మాత్రం భారీగా నిధులు..

నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ల‌కు ఫండ్స్ రిలీజ్‌ చేసింది. దీని విలువ 8,453.92 కోట్ల రూపాయలు. లోక‌ల్ బాడీస్‌ పరిధిలో వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి, హాస్పిట‌ళ్ల‌లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఈ మొత్తాన్ని వినియోగించుకోవాల‌ని ఫైనాన్స్ మినిస్ట్రీ స్పష్టం చేసింది.

కాగా, ఈ నిధులన్నీ గ్రాంట్‌గా విడుదల అయ్యాయి. మొత్తం 19 రాష్ట్రాల స్థానిక సంస్థలకు వీటిని మంజూరు చేశారు. అయితే ఇందులో ఏపీ వాటా కింద 488.15 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వైద్య, ఆరోగ్య రంగానికి ఈ నిధులతో మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది.

హాస్పిట‌ళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రిపేర్లు చేయడం, అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు.. వాటిని అప్‌గ్రేడ్ చేయడం, రోగులకు కల్పించే సదుపాయాలను మరింత మెరుగుపర్చడం వంటి చర్యల కోసం ఏపీ ప్రభుత్వం ఈ 488.15 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాగా.. తెలంగాణ ప్ర‌భుత్వానికి ఈ గ్రాంట్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం మొండి చేయి చూపడం గ‌మ‌నార్హం..

గ్రాంట్ విడుద‌లైన రాష్టాల్లో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, అస్పాం, బిహార్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, జార్ఖండ్‌, క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, మ‌ణిపూర్‌, మిజోరాం, ఒడిశా, పంజాబ్‌, రాజ‌స్థాన్‌, సిక్కిం, త‌మిళ‌నాడు, ఉత్త‌రాఖండ్, వెస్ట్ బెంగాల్ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement