Wednesday, May 1, 2024

ఏపీలో ప్రభుత్వ బడుల సమయం పెంపు.. స్కూల్ టైమింగ్స్ ఇవి

అంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల సమయాన్ని పొడిగించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేసేలా పాఠ్య ప్రణాళికను రూపొందించారు. ప్రారంభానికి ముందు గంటా 45 నిమిషాలు, తరగతులు ముగిసిన తర్వాత గంటా 15 నిమిషాలను పెంచి.. ఉన్నత పాఠశాలల మొత్తం సమయాన్ని 10 గంటలు చేశారు.  గతంలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 9.45 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు పని చేసేవి. గతేడాది కరోనా నేపథ్యంలో ఈ సమయాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు మార్చారు. ఇప్పుడు సహ పాఠ్య కార్యక్రమాల కోసం సమయం పెంచుతూ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 188 రోజులు బడులు పని చేయనున్నాయి. ఏప్రిల్‌ 30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం వేసవి సెలవులు ఇస్తారు.

సమ్మెటివ్‌-1 పరీక్ష 6-10 తరగతులకు డిసెంబరు 27 నుంచి జనవరి 7 వరకు, సమ్మెటివ్‌-2 పరీక్ష 6-9 తరగతులకు ఏప్రిల్‌ 18 నుంచి 29 వరకు నిర్వహిస్తారు. సెప్టెంబరు, నవంబరు, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫార్మెటివ్‌ పరీక్షలు ఉంటాయి. ఈ ఏడాదీ విద్యార్థులు నీళ్లు తాగేందుకు ‘నీటి గంట’ అమలు చేస్తున్నారు. ఇందుకు 5 నిమిషాలు విరామం ఇస్తారు. ప్రతి నెలా మొదటి, మూడో శనివారం ‘నో బ్యాగ్‌ డే’ను నిర్వహిస్తారు. బోధన ప్రణాళికలు, తరగతిలో గమనించిన అంశాలు రాసుకునేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక డైరీ ఉంటుంది. విద్యార్థుల్లో పుస్తక పఠనం పెంచేందుకు ప్రతి రోజు ఒక పీరియడ్‌ ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమానికి కేటాయిస్తారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రతి శుక్రవారం 8వ పీరియడ్‌లో ‘కెరీర్‌ గైడెన్స్‌’పై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులను ఆహ్వానిస్తారు. వారంలో ఒక రోజు పాఠశాల ఆరోగ్య కార్యక్రమం, ప్రముఖ దినోత్సవాలు, సామూహిక పఠనంలాంటివి నిర్వహించాల్సి ఉంటుంది.

కాగా, ఈ నెల 16 నుంచి రాష్ట్రంలోని స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తరగతి గదికి 20 మంది విద్యార్థులు మించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే.. విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. స్టూడెంట్స్‌ మాస్క్‌ ధరించేలా, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇది కూడా చదవండిః దళిత బంధు పథకంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement