Sunday, April 28, 2024

AP : విద్యార్ధిని మింగేసిన రాకాసి అల….

అనకాపల్లి జిల్లా తంతడి బీచ్‌కు విద్యార్థులు సరదాగా విహారానికి వెళ్లారు. ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. రాకాసి అలల రూపంలో అంతలోనే విషాదం చుట్టుముట్టింది. సహచరుల్లో ముగ్గురు అలల్లో చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

మరొకరు అలల తాకిడికి సముద్రంలో గల్లంతయ్యాడు. దీంతో బాలుడి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలలోకి వెళితే అనకాపల్లి జిల్లా పరవాడ బీసీ కాలనీకి చెందిన రాజేష్.. తన స్నేహితులైన మోక్షజ్ఞ, విజయ్, కిషోర్, కళ్యాణ చక్రవర్తితో కలిసి తంతడి బీచ్‌కు విహారానికి వెళ్లారు. కళ్యాణ్‌ చక్రవర్తి మినహా మిగిలిన నలుగురు మైనర్లే. అంతా కలిసి బైకులపై బీచ్‌కి వెళ్లారు.

అక్కడ కొంతమంది క్రికెట్ ఆడుతుండగా.. మరి కొంతమంది సముద్రంలో జలకాలాడడానికి వెళ్లారు. రాజేష్, మోక్షజ్ఞ, విజయ్ సముద్రంలో దిగారు. కిషోర్, కళ్యాణ్ చక్రవర్తి ఒడ్డుపైనే ఉన్నారు. ఎవరి సరదాలో వాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా భారీ కెరటం వచ్చింది. దీంతో రాజేష్, మోక్షజ్ఞలపే సముద్రంలోకి ఆ అలలు లాకెళ్లిపోయాయి. దీంతో అక్కడే ఉండి అప్రమత్తమైన కళ్యాణ్ చక్రవర్తి అతి కష్టం మీద మోక్షజ్ఞను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చాడు. కానీ రాజేష్ ను రక్షించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కళ్ళముందే రాజేష్ కొట్టుకుపోతున్న ఏమి చేయలేని సహాయ స్థితిలో ఉండిపోయారు స్నేహితులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు ప్రారంభించారు. కాగా సముద్రంలో గల్లంతైన బాలుడు రాజేష్ పరవాడ జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. తండ్రి పెయింటర్. కొడుకు సముద్రంలో గల్లంతవ్వడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన అందరిని కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement