Wednesday, May 15, 2024

మిలాన్‌-22కు చురుగ్గా ఏర్పాట్లు.. రేప‌టి నుంచి మార్చి 4 వరకూ నిర్వహణ

విశాఖ వేదికగా ఈ నెల 25 నుంచి మార్చి 4వ తేది వరకూ రెండు దశల్లో జరిగే బహుపాక్షిక విన్యాసాలకు భారత నౌకాదళం సారధ్యం వహించనుంది. ఈ క్రమంలోనే మిలాన్‌-22 వేడుకులు ఘనంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో ప్రతిష్టాత్మాకంగా ప్రెసిడింట్‌ ఫ్లీట్‌రివ్యూ(ఫిఎఫ్‌ఆర్‌) వేడుకులను రాష్ట్రపతి ముఖ్యఅతిధిగా హాజరై నిర్వహించిన విషయం తెలిసిందే. భారతదేశం బాధ్యతాయుతమైన సముద్రశక్తిని ప్రపంచాని చూపడమే లక్ష్యంగా బహుళ జాతీయ విన్యాసాలను ఇండియన్‌ నేవీ నిర్వహించనుంది. అంతేకాకుండా పలు దేశాల నౌకాదళల మధ్య స్నేహపూర్వక,వృత్తిపరమైన పరస్పర చర్యలు చేపట్టనున్నారు.ముఖ్యంగా ఈ ఏడాది సహస్రవ సమన్వయం,సహకారం పేరిట నిర్వహించనున్న ఈ వేడుకులకు 40 దేశాలకు చెందిన నేవీ అధికారులు, ప్రముఖలు,సిబ్బంది పాల్గొనున్నారు. ఈ వేడుకులను విజయవంతం చేసేందుకు ఈఎన్‌సీ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.

విశాఖపట్నం, ప్రభన్యూస్‌: మిలాన్‌ అంటే.. హిందీలో సమావేశం అని అర్థం. 2018 అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో జరిగిన ఈ విన్యాసాల్లో 17 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి అంతకు మించి భారీ ఏర్పాట్లకు ఈఎన్‌సీ సమాయత్తమవుతోంది. వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరుచుకోవడంతో పాటు- శత్రుసైన్యానికి బలం, బలగం గురించి నిత్యం తెలియజేసేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తుంటారు. ఈ నెల 25 నుంచి మార్చి 4 వరకు జరగనున్న మిలాన్‌ బహుపాక్షిక విన్యాసాలకు భారత నౌకాదళం సారధ్యం వహించనుంది. వాస్తవానికి 2020 మార్చి 19 నుంచి 27 వరకూ మిలాన్‌ విన్యాసాలు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్‌ కారణంగా ఈ వేడుకులను వాయిదా వేశారు. 2021 మార్చిలో నిర్వహించాలని భావించినా కరోనా పరిస్థితులు అనుకూలించకపోవడంతో మరోమారు వాయిదా వేసి ప్రస్తుతం నిర్వహించనున్నారు.

ఇప్పటివరకు 11 మిలాన్‌లు
1995లో మిలాన్‌ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. తొలిసారి జరిగిన విన్యాసాల్లో భారత్‌తో పాటు- ఇండోనేషియా, సింగపూర్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2005లో సునామీ రావడం వల్ల మిలాన్‌ విన్యాసాలు రద్దు కాగా, 2001, 2016 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్‌ ప్లీnట్‌ రివ్యూలు నిర్వహించడం వల్ల జరగలేదు. 2010 వరకూ 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో జరిగిన విన్యాసాల్లో దేశాల సంఖ్య రెట్టింపై ఏకంగా 16 దేశాలు పాల్గొన్నాయి. 2014లో 17 దేశాలు పాల్గొని అతి పెద్ద ప్లీnట్‌ రివ్యూగా చరితకెక్కింది. 2018లో అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌లో జరిగిన విన్యాసాల్లో ఏకంగా 17 దేశాలు పాల్గొన్నాయి. మొత్తంగా ఇప్పటి వరకూ 11 సార్లు మిలాన్‌ విన్యాసాలు జరిగాయి.

అతి పెద్ద మిలాన్‌గా రికార్డు
మిలాన్‌-2022 విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత నౌకాదళం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, యూరప్‌ దేశాలకు ఆహ్వానాలు అందించింది. భారత్‌తో పాటు- యూఎస్‌ఏ, రష్యా, జపాన్‌, యూకే, ఆస్ట్రేల్రియా, సింగపూర్‌, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఫ్రాన్స్‌, ఈజిప్ట్‌, శ్రీలంక, వియత్నాం, మోజాంబిక్‌, సూడాన్‌, ఇజ్రాయిల్‌, ఖతర్‌, థాయ్‌లాండ్‌, మలేషియా, సోమాలియా, కెన్యా, మయన్మార్‌, న్యూజిలాండ్‌, టాంజానియా, కొమరోస్‌, మాల్దీవులు, బ్రూనే, ఫిలిప్పీన్స్‌, సౌదీ అరేబియా, ఒమన్‌, కాంబోడియా, దక్షిణ కొరియా, కువైట్‌, ఇరాన్‌, మడగాస్కర్‌, బంగ్లాదేశ్‌, బహ్రెయిన్‌, యూఏఈ, జిబౌటీ-, ఎరిత్రియా, మారిషస్‌, సీషెల్స్‌ మొదలైన దేశాలకు భారత నౌకాదళానికి చెందిన ప్రతినిధులు ఆహ్వానాలు అందించారు.ఇందులో ఇప్పటికే 35 దేశాలు తాము పాల్గొంటు-న్నట్లు- అంగీకారం తెలిపాయి. మిగిలిన దేశాలూ వచ్చే అవకాశాలున్నాయి. సుమారు 40 కి పైగా దేశాలు రానున్న నేపథ్యంలో అతి పెద్ద మిలాన్‌కు వేదికగా విశాఖ రికార్డు సృష్టించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు ప్రణాళిక సమావేశాల్ని నిర్వహించారు. తొలి సమావేశంలో 17 దేశాలకు చెందిన 29 మంది నౌకాదళ కీలకాధికారులు పాల్గొనగా.. తాజాగా విశాఖలోని వివిధ ప్రభుత్వ అధికారులతో తూర్పునౌకాదళం సమీక్ష నిర్వహించింది. ఏర్పాట్లు- విషయంపై సుదీర్ఘంగా చర్చించింది.

తొమ్మిది రోజులు…రెండు దశలు
మిలాన్‌-2022 విన్యాసాలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు- చేస్తున్నట్లు- తూర్పు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. అయితే తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో రెండు దశలున్నాయి,వీటిలో సీ ఫేజ్‌, హార్బర్‌ ఫేజ్‌లలో రెండు ఫేజ్‌లలో విన్యాసాలు నిర్వహించనున్నారు. చరిత్రాత్మకమైన ఈవెంట్‌ విజయవంతం చేసేందుకు విశాఖ ప్రజలంతా కృషి చెయ్యాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ నెల 27,28 తేదీలలో సహకారం ద్వారా సామూహిక సముద్ర పోటీ-ని ఉపయోగించడం అనే థీమ్‌తో అంతర్జాతీయ సముద్ర సెమినార్‌ను కూడా నిర్వహిస్తుంది. అదే విధంగా విశాఖ సాగరతీరంలో పలు దేశాల నుంచి యుద్ధనౌకలు,విమానాలు,నేవీ సిబ్బంది విన్యాసాలతో సిటీ పరేడ్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు, నేవీ అధికారులు, స్ధానిక మంత్రులు, అధికారులు, నాలుగు లక్షల మంది నగర ప్రజలు హాజరవుతారని అంచనా వేసి దీనికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర కార్యకలాపాలలో వృత్తి విషయ నిపుణుల మార్పిడి, ప్రదర్శన, యువ అధికారుల మిలన్‌, క్రీడా పోటీ-లు, విదేశీ సందర్శకుల కోసం ఆగ్రా, బోధ్‌ గయాకు సాంస్కృతిక సందర్శనలు ఉన్నాయి. నౌకలు విమానాలతో పాల్గొనే దేశాల కోసం సముద్ర దశ వ్యాయామం కోసం షెడ్యూల్‌ను ప్రకటించారు.

- Advertisement -

మహాసముద్రాల బంధాలను పెంపొందించడం లక్ష్యంగా…
ఇండియన్‌ నేవీ అనేది పవర్‌ ప్రొజెక్షన్‌ కోసం మాత్రమే కాకుండా, దౌత్యపరమైన విస్తరణకు కూడా ఒక పరికరం. ఈ దిశగా, వివిధ నౌకాదళాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఉమ్మడి బహుళ పార్శ్వ వ్యాయామాలను నిర్వహించడం ఒక ముఖ్యమైన చర్యగా భావించి, నౌకాదళాలు వివిధ ప్రాంతాలలో పని చేస్తున్నప్పటికీ, పైరసీ వ్యతిరేక,ఆత్యాధుని మిషన్లు, సముద్ర భద్రత మొదలైన ఉమ్మడి ప్రయోజనాలపై ఎల్లప్పుడూ సహకరించుకోవాల్సిన అవసరం ఉందని, నౌకాదళం పరస్పర చర్యలు, సముద్రల మధ్య పరస్పర అవగాహన, సహకారం అంతర్‌-ఆపరేబిలిటీ-ని మెరుగుపరుస్తాయిని నేవీ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మిలానా-22 మహాసముద్రాల అంతటా సముద్ర సోదర బంధాలను పెంపొందించడానికి ఒక అమూల్యమైన అవకాశాన్ని అందిస్తుందన్నారు.

ఆకట్టుకుంటున్న రిహార్సల్స్‌
మిలాన్‌-22లో భాగంగా విశాఖ సాగరతీరంలో నిర్వహిస్తున్న రిహార్స్‌ల్స్‌ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. యుద్ధనౌకల,విమానాల విన్యాసాలు, నేవీ సిబ్బంది చేస్తున్న పలు విన్యాసాలు, విద్యార్థుల నృత్యాలు, పలు దేశాల మధ్య సత్ససంబంధాలను తెలిపే విధంగా ఏర్పాటు చేసిన జెండాలు, తదితర వాటితో విశాఖ సాగరతీరం సందడి చేస్తుంది. ఈ విన్యాసాలను తిలకించేందుకు నగర ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మరో వైపు 27న నిర్వహించే సిటీ పరేడే నేపథ్యంలో తగిన ఏర్పాట్లు,భద్రత చర్యలు చేపడుతున్నారు. ఇదే సమయంలో విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా ఆధ్వర్యంలో బీచ్‌లోని ఏర్పాట్లును కూడా పరిశీలించి, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement