Monday, April 29, 2024

Kakinada: ఫిషింగ్ బోట్‌లో అగ్నిప్రమాదం.. రంగంలోకి కోస్టు గార్డ్ సిబ్బంది

కాకినాడ జిల్లా బైరవపాలెం సముద్రం మధ్య లో ఫిషింగ్ బోట్ అగ్నిప్రమాదానికి గురైంది. ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బోటులో 10 మంది మత్స్యకారులు ఉన్నారు. ప్రమాద విషయాన్ని తెలుసుకొని కోస్టు గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. మత్స్యకారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఉదయం 9గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో బోటు ప్రమాదం జరిగింది. బోటు ఇంజిన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా బోటు ముందు భాగంలో అగ్నికీలలు వ్యాపించాయి.

మంటలను గుర్తించిన మత్స్యకారులు వాటిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బోటు ముందు భాగంలో అగ్నికీలలు పూర్తిగా వ్యాపించాయి. వెనుకభాగం అంతా పూర్తిగా పొగలు వ్యాపించాయి. ఈ అగ్నికీలలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఈత వచ్చిన కొందరు మత్య్సకారులు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. సముద్ర తీరానికి కొద్దిదూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవటం, కోస్టుగార్డ్ సిబ్బంది ప్రమాదం జరిగిన బోటుకు అత్యంత సమీపంలో ఉండటంతో వెంటనే కోస్ట్ గార్డు సిబ్బంది అప్రమత్తమై బోటు దగ్గరకు చేరుకున్నారు. బోటులో ఉన్నవారిని సురక్షితంగా రక్షించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement