Tuesday, May 14, 2024

AP | మదనపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు మృతి

మదనపల్లి, (ప్రభ న్యూస్): ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి-బెంగళూరు రోడ్డులోని బర్లపల్లి వద్ద ఆదివారం రాత్రి స్కూటర్‌ను స్కార్పియో ఢీకొనడంతో స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్కార్పియోలో ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి తప్పించుకుని పోయే క్రమంలో.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో మరో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో కొల్లావారిపల్లికి చెందిన ఇద్దరు, స్థానిక రామారావు కాలనీకి చెందిన మరో ముగ్గురు ఉన్నారు.

తీవ్ర విషాదాన్ని నింపిన ఘటనకు సంబంధించి మదనపల్లి తాలూకా సిఐఎన్ శేఖర్ కథనం మేరకు వివరాలు.. మదనపల్లి మండలం బార్లపల్లి సమీపంలోని కోళ్ల వారి పల్లికు చెందిన చంద్ర, సుబ్రహ్మణ్యం ఆచారిలు పాలు పోయడానికి బెంగళూరు రోడ్డుకు బైకులో వచ్చారు. పాలు పోసి ఇంటికి వెళుతున్న సమయంలో మదనపల్లి రామారావు కాలనీకి చెందిన ఓ స్కార్పియో బెంగళూరుకి వెళ్లి పని ముగించుకుని తిరిగి మదనపల్లికి వచ్చే క్రమంలో పాలు పోసి వెళుతున్న బైకును ఢీకొంది.

ఈ ప్రమాదంలో కోళ్లబారిపల్లికి చెందిన చంద్ర సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదం చేసి తప్పించుకుని పారిపోయే క్రమంలో స్కార్పియో మరికొంత దూరం మదనపల్లి వైపు వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడ్డ వారిని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారంతా మదనపల్లి పట్టణం, రూరల్ మండలానికి చెందిన వారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన కొందరి వివరాలు తెలియాల్సి ఉండగా మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని మార్చిది తరలించికేసు నమోదు చేసినట్లు సీఐఎన్ శేఖర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement