Sunday, May 19, 2024

ఒకే రాజ‌ధానికోసం ఢిల్లీకి వెళ్లిన అమ‌రావ‌తి రైతులు.. రేపు జంతర్ మంతర్ వద్ద నిరసన

ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు. విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో 1500 మంది అన్నదాతలు బయల్దేరారు. మూడు రోజుల పాటు దేశ రాజధానిలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్న రైతులు.. అమరావతి ఉద్యమానికి జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేలా ప్రణాళికలు రూపొందించారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. వెయ్యి రోజులుగా పోరాటం చేస్తున్న రైతులు తమ గళాన్ని ఢిల్లీలో గట్టిగా వినిపించనున్నారు. రాజధాని గ్రామాల్లో ఇప్పటికే రిలే దీక్షలు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర వంటి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. ఈ పరంపరలో రాజధాని రైతులు.. ఇప్పుడు జాతీయస్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయల్దేరారు.

సీఎం జగన్.. మూడు రాజధానుల ప్రకటన చేసి డిసెంబ‌ర్ 17వ తేదీకి మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో.. అమరావతి రైతులు ఈ యాత్ర చేపట్టారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ.. అన్ని పార్టీల ఎంపీలు జాతీయ పార్టీల అధినేతలను కలిసి అమరావతి ఆవశ్యకతతో పాటు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించనున్నారు. అమరావతి రైతులు చేపట్టి ఈ దేశ రాజధాని యాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా రైతు సంఘాలు మద్దతు ప్రకటించడం గమనార్హం. 17వ తేదీ ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు. 18న జాతీయ పార్టీల అధినేతలు ఎంపీలను కలిసి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వివరించనున్నారు. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement