Saturday, May 18, 2024

AP | రాష్ట్రంలో రూ.41 కోట్లతో కొత్త రైతు బజార్ల ఏర్పాటు

అమరావతి, ఆంధ్రప్రభ : రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులతో పాటు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం రైతుబజార్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేషన్లు, పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో నూతనంగా మరిన్ని రైతు బజార్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

రైతు బజార్ల ద్వారా అటు రైతులు.. ఇటు వినియోగ దారులకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశ్యంతో నూతనంగా రూ.41.09 కోట్ల వ్యయంతో 54 కొత్త రైతు బజార్లను నెలకొల్పుతోంది. వీటిలో ఇప్పటికే 15 రైతు బజార్లు అందుబాటులోకి రాగా.. మరో 3 రైతు బజార్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర విభజన సమయానికి ఏపీలో 87 రైతు బజార్లు ఉండేవి. నూతన రైతు బజార్ల ఏర్పాటు ప్రతిపాదన ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ స్థలాల కొరత, నిధుల లేమి సాకుతో గత ప్రభుత్వం వాటి జోలికి పోలేదు.

ఉన్న రైతు బజార్లలోనూ కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఫలితంగా రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సేవలు మరింత విస్తృతం చేసేందుకు నూతనంగా రైతుబజార్ల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది.

- Advertisement -

కాకినాడ జిల్లాలో అత్యధికంగా 10, తూర్పు గోదావరి జిల్లాలో 4, విజయనగరం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో 3 చొప్పున, విశాఖపట్నం, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో 2 చొప్పున, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, బాపట్ల, తిరుపతి, నంద్యాల, కర్నూలు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణానికి 11 టెండర్ల దశలో ఉండగా, 7 బేస్‌మెంట్‌, 8 రూఫ్‌స్థాయి, 5 సీలింగ్‌ స్థాయిల్లో ఉండగా, మరో ఐదుచోట్ల టెండర్లు పిలవాల్సి ఉంది.

అదే విధంగా నాడు-నేడు కింద మౌలిక వసతుల కల్పన నాడు-నేడు కింద రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, వైఎస్సార్‌ జిల్లాల్లోని మొత్తం రైతుబజార్లను ఆధునికీకరిస్తున్నారు. శిథిలమైన షెడ్ల పునర్నిర్మాణంతో పాటు ఆర్వో ప్లాంట్స్‌, విద్యుత్‌, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు.

పార్కింగ్‌, హోర్డింగ్స్‌, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో స్వయం సంవృద్ధి సాధించే దిశగా రైతుబజార్లను తీర్చిదిద్దుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 54 కొత్త రైతుబజార్ల నిర్మాణానికి ప్రభుత్వం రూపకల్పన చేయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement