Monday, April 29, 2024

శ్రీశైలానికి కార్తీక శోభ..పోటెత్తిన భక్తజనం


జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక రెండవ సోమవారం సందర్భంగా భ్రమరాంబ దేవి సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. వేకువజామునే భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వేకువజామున 3.30గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి.. ఆలయ శుద్ధి, ప్రదోషకాల పూజలు నిర్వహించారు. 5.30 గంటలకు స్వామి, అమ్మవార్ల దర్శనాలకు భక్తులను అనుమతించారు.

గర్భాలయంలో స్పర్శ దర్శనాలను నిలిపివేశారు. శీఘ్ర‌, అతి శీఘ్ర, ఉచిత క్యూలైన్లలో భారీగా భక్తులు బారులు తీరగా.. దర్శనానికి దాదాపు 5 గంటల వరకు సమయం పట్టిందని అధికారులు తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌ లవన్న ఆదేశాల మేరకు క్యూలైన్లలో భక్తులకు వేడి పాలు, బిస్కెట్లు, అల్పాహారాన్ని అధికారులు అందించారు. అలాగే ఉదయం 10.30 గంటలకు భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు చేపట్టారు. కార్తీక మాసం సందర్భంగా ఉత్తరమాడ వీధి, గంగాధర మండపం వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. పలువురు భక్తులు లక్ష వొత్తుల నోములు సైతం నిర్వహించుకున్నారు. సుమారు లక్షకుపైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగ‌కుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్న ఎప్పటికప్పుడు స్వయంగా క్యూలైన్లను పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement