Friday, May 17, 2024

ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగించేలా తిరుమల పార్కుల అభివృద్ధి : టీటీడీ చైర్మన్

తిరుమల : తిరుమలలో భక్తులు అడుగుపెడుతూనే వారికి ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగేలా పార్కులు అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఆనుకుని పునర్నిర్మించిన పార్కును చైర్మన్ సుబ్బారెడ్డి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించి పక్కాగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే దాతల సహకారంతో పార్కులన్నీ పెద్దఎత్తున పునర్నిర్మిస్తున్నామని, దీని ద్వారా పర్యావరణ పరిరక్షణ మరింతగా జరుగుతుందన్నారు.

అలాగే తిరుమలకు 50 విద్యుత్ బస్సులు నడిపేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసి ఆర్టీసీకి బస్సులు అందే ఏర్పాటు చేశారని చైర్మన్ తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 27వ తేదీ 10 విద్యుత్ బస్సులను సి ఎం ప్రారంభిస్తారని వివరించారు. 27వ తేదీ తిరుపతిలో కరకం బాడి వైపునుంచి వాసవి భవన్ వరకు నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తారన్నారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి 28వ తేదీ ఉదయం నూతన పరకామణి భవనం ప్రారంభిస్తారని చైర్మన్ తెలిపారు. రెండున్నరేళ్ల తరువాత భక్తుల మధ్యన స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నందువల్ల భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. పార్కు పునర్నిర్మాణ దాత హైదరాబాద్ కు చెందిన రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు, సీవీఎస్ఓ నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, వీజీవో బాలిరెడ్డి పాల్గొన్నారు.


పార్కుల పరిశీలన …
అనంతరం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి తిరుమలలో నారాయణగిరి, స్పెషల్ టైప్, జీఎన్ సీ, గీతాపార్కు, పద్మావతి అథితి గృహం పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement