ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితం కడపకు చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కడపకు వెళ్లారు. ఈసందర్భంగా కడప ఎయిర్ పోర్టులో జగన్ కు వైసీపీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ లో గోపవరంకు సీఎం బయల్దేరారు. సెంచురీ పరిశ్రమలో ఎండీఎఫ్, హెచ్పీఎల్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. అనంతరం కడప రిమ్స్ ఆసుపత్రి వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు.
అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. రేపు వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. తర్వాత సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ చేరుకుని పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 25వ తేదీ ఉదయం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.