Sunday, April 28, 2024

BREAKING: గడ్కరీతో సీఎం జగన్ భేటీ.. విశాఖ– భోగాపురం బీచ్‌ కారిడర్‌ ప్రాజెక్ట్‌పై చర్చ

కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి  నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక రోడ్డు ప్రాజెక్టులపై చర్చించారు. విశాఖ– భోగాపురం బీచ్‌ కారిడర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని మేలైన ఆలోచనలు చేయాలంటూ గత రాష్ట్ర పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహామేరకు అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని సీఎం వివరించారు. విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతోపాటు, పర్యాటకరంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు.

విజయవాడ వెస్ట్రన్‌ బైసాస్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, దీనికి సీఆర్డీయే గ్రిడ్‌ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ వెస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ఈ భూములను కూడా గుర్తించిందని వెంటనే డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. విజయవాడ ఈస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి కూడా డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు వేగవంతంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ గడ్కరీని కోరారు.

రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరుచేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరుచేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ఏర్పడ్డ  జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్‌ వే ల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకరించింది. మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరుచేయాలని కేంద్రమంత్రి గడ్కరీని సీఎం జగన్‌ కోరారు.

కాగా, సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు హాజరయ్యారు.  గడ్కరీతో భేటీ అనంతరం సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఏపీకి తిరుగుపయనం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement